లండన్: బ్రిటన్ జనరల్ ఎలక్షన్లో ప్రధాని బోరిస్ జాన్సన్ ఘన విజయం సాధించారు. తిరుగులేని మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయన ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్అంచనాలను తలకిందులు చేస్తూ మెజారిటీ సీట్లను దక్కించుకుంది. అధికారాన్ని చేపట్టడానికి 326 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా.. పూర్తి ఫలితాలు వెలువడకముందే కన్జర్వేటివ్ పార్టీ ఈ మార్క్ను దాటేసింది. మరో వంద సీట్ల ఫలితాలు వెలువడాల్సి ఉండగానే ఆ పార్టీ క్యాండిడేట్లు 363 చోట్ల గెలుపొందారు. దీంతో యూకే వ్యాప్తంగా నెలల తరబడి కొనసాగిన రాజకీయ అస్థిరత్వానికి ముగింపు పలికినట్లయింది. 1980లో మార్గరెట్థాచర్తర్వాత ఆ స్థాయిలో మెజారిటీ సాధించి బోరిస్ జాన్సన్ రికార్డు సృష్టించారు. లండన్లోని అక్స్బ్రడ్జి నియోజకవర్గంలో బోరిస్ గెలుపొందారు. మరోసారి ప్రధాని సీట్లో కూర్చోబోతున్నారు. పార్టీ విజయం కన్ఫర్మ్ కావడంతో లండన్లో జరిగిన విజయోత్సవ ర్యాలీలో బోరిస్మాట్లాడుతూ.. దేశానికి ఇదో కొత్త సూర్యోదయమని అన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని చెప్పారు. బ్రెగ్జిట్విషయంలో మరోసారి రెఫరెండమ్ నిర్వహించాలన్న ఆలోచనే వద్దని ఈ ఎన్నికల ద్వారా ప్రజలు తీర్పిచ్చారని చెప్పారు. బ్రెగ్జిట్ నుంచి వైదొలిగే విషయంలో మరో ఆలోచనకు తావివ్వబోమని బోరిస్ స్పష్టంచేశారు. దీంతో పాటు దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. త్వరలో బకింగ్హామ్ ప్యాలెస్లో క్వీన్ ఎలిజబెత్–2 ముందు బోరిస్ జాన్సన్ అధికారాన్ని చేపడతారు.
లేబర్ పార్టీ చీఫ్ రిజైన్
ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం రెండొందల పైచిలుకు సీట్లలో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల వైఫల్యానికి నైతిక బాధ్యత తనదేనని, ఇకపై జనరల్ ఎలక్షన్లలో పార్టీకి నాయకత్వం వహించబోనని జెరెమి కార్బిన్ స్పష్టం చేశారు. లండన్లోని ఇస్లింగ్టన్ నార్త్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. బ్రెగ్జిట్ విషయంలో కార్బిన్ స్పష్టతనివ్వకపోవడం, అధికారంలోకి రాగానే మరోసారి రెఫరెండమ్ నిర్వహిస్తామని చెప్పడమూ ఈ ఓటమికి ఓ కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీంతో పాటు కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం కల్పించుకోవాలంటూ ఎమర్జెన్సీ మోషన్ తీసుకురావడంపై యూకేలోని ఇండియన్ సంతతిలో అసంతృప్తికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు.
మనోళ్లు అదరగొట్టారు..
యూకే జనరల్ ఎలక్షన్లలో మనోళ్లు అదరగొట్టారు. కన్జర్వేటివ్ పార్టీతో పాటు లేబర్ పార్టీ నుంచి పోటీచేసిన అభ్యర్థులు కూడా గెలుపొందారు. సిట్టింగ్ ఎంపీలు 12 మంది తమ సీట్లను నిలబెట్టుకోగా.. మరో ముగ్గురు కొత్తవాళ్లు కూడా గెలిచారు. వీరిలో ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ కూడా ఉన్నారు. 27 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో మొత్తం 36,693 ఓట్లు సాధించారు. సిట్టింగ్ స్థానాల్లో గెలిచిన ఇండియన్ సంతతి ఎంపీలు.. ప్రీతి పటేల్, శైలేష్ వరా, రిషి సునక్, ప్రీత్ కౌర్ గిల్, తన్మన్జీత్ సింగ్ దేశి, వీరేంద్ర శర్మ, అలోక్ శర్మ, స్యూయెల్లా బ్రేవర్మాన్, లీసా నాండీ, సీమా మల్హోత్రా తదితరులు ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఇండియన్ సంతతి లీడర్లు.. కన్జర్వేటిప్ పార్టీ నుంచి గగన్ మోహింద్ర, క్లైరే కౌటిన్హో, లేబర్ పార్టీ నుంచి నవేంద్రు మిశ్రా.