ఇయ్యాల, రేపు (ఆగస్టు 4,5)  హైదరాబాద్ లో బ్రిక్స్ సదస్సు

ఇయ్యాల, రేపు (ఆగస్టు 4,5)  హైదరాబాద్ లో బ్రిక్స్ సదస్సు
  • అంతర్జాతీయ స్థాయిలో అవినీతి నిర్మూలన, ఆస్తుల రికవరీపై చర్చలు

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ స్థాయిలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే లక్ష్యంగా బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం రెండో సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనుంది. ‘స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ ‘ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌‌‌‌‌‌‌‌వర్క్’  పై చర్చించనున్నారు. ఈ ఉన్నత స్థాయి కార్యక్రమాన్ని డీవోపీటీ కార్యదర్శి రచనా షా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులతో పాటు సీనియర్ విధాన రూపకర్తలు, అవినీతి నిరోధక, లాఎన్ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ సంస్థలకు చెందిన నిపుణులు, ప్రాక్టీషనర్లు హాజరుకానున్నారు.

గత జూన్ 2, 3 తేదీల్లో వర్చువల్ విధానంలో విజయవంతంగా నిర్వహించిన మొదటి సమావేశ ఫలితాలను, సాధించిన పురోగతిని సమీక్షిస్తూ ఈ సమావేశంలో ఆచరణాత్మక ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించనున్నారు. అవినీతి కేసుల్లో విదేశాలకు పరారైన నేరస్తుల ఆచూకీ కనిపెట్టడం, వారి అప్పగింత ప్రక్రియలను సులభతరం చేసేందుకు సభ్య దేశాల మధ్య అనధికారిక సహకారాన్ని పెంచడంపై దృష్టి సారిస్తారు.

ఆస్తుల రికవరీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ద్వారా సమాచారాన్ని వేగంగా పంచుకుంటూ కార్యాచరణ  విస్తరించడం, అభివృద్ధి చెందుతున్న ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్, డిజిటల్ ఆస్తులు, డిజిటల్ ఆర్థిక సాధనాల వలన కలిగే అవినీతి ముప్పును అరికట్టడంపై అనుభవాలను పంచుకోనున్నారు. దీనితో పాటు ఆగస్టు 5న ‘ఆవిష్కరణ, సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పరిపాలన’ అనే అంశంపై ప్రత్యేక   కార్యక్రమం  జరగనుంది.