సీఎం రేవంత్ రెడ్డితో.. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో.. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ


దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావటం చర్చనీయాంశం అయ్యింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంట్లోనే.. ఈ నలుగురు ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. సీఎంను కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉన్నారు.

రాబోయే లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీలో సమీక్షలు జరుగుతున్న సమయంలోనే.. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం ఆసక్తిగా మారింది. నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు.. మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా రాజకీయంగా మాత్రం సంచలనంగా మారింది.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని  దావోస్ పర్యటనలో  సీఎం రేవంత్ రెడ్డి  చేసిన కామెంట్స్ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు 39 ముక్కలవుతారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా నిన్న కామెంట్స్ చేశారు. 30 మంది బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో  టచ్ లో ఉన్నారని చెప్పారు.  

మరో వైపు త్వరలో పులి బయటకొస్తది..ఆట మొదలు పెడ్తదని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ వేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.