బీఆర్ఎస్ ప్రచార వాహనం ధ్వంసం

బీఆర్ఎస్ ప్రచార వాహనం ధ్వంసం

పరకాల, వెలుగు :  హన్మకొండ జిల్లా పరకాల బస్టాండ్​సెంటర్​లో కాంగ్రెస్​ పార్టీ కార్నర్​ మీటింగ్​ నిర్వహిస్తుండగా బీఆర్ఎస్​ ప్రచార వాహనం అటూఇటూ చక్కర్లు కొట్టడంతో కాంగ్రెస్​ నాయకులు బీఆర్ఎస్​ వాహనాన్ని ధ్వంసం చేశారు. కాంగ్రెస్​అభ్యర్థి రేవూరి ప్రకాష్​రెడ్డి మాట్లాడుతుండగా ముందుగా వెల్లంపల్లి రోడ్డు నుంచి బస్టాండ్​ వైపుకు వచ్చిన బీఆర్ఎస్​ ప్రచార వాహనం మైకును బంద్​ చేయకుండానే వెళ్లింది. 

పది నిమిషాల వ్యవధిలో మళ్లీ ప్రచార వాహనం అధిక సౌండ్​తో రావడంతో కాంగ్రెస్​నాయకులు, కార్యకర్తలు సౌండ్​బంద్​ చేయాలని డ్రైవర్​కు సూచించారు. అయినా సౌండ్​బంద్​చేయకపోవడంతో ప్రకాష్​రెడ్డి జోక్యం చేసుకుని పోనివ్వండి ఇలాంటివాటిని పట్టించుకోవద్దని చెప్పారు. అయినా ఆగని కాంగ్రెస్​నాయకులు బీఆర్ఎస్​ప్రచార రథానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేశారు. పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్​ వారిని వారించి బీఆర్ఎస్​ ప్రచార వాహనాన్ని అక్కడి నుంచి పంపించివేశారు. కొద్దిసేపటికే బీజేపీ వాహనం అటుగా రాగా బస్టాండ్​ నుంచి వెల్లంపల్లి రోడ్డుకు పంపించారు.