ఎండిన పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపట్నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఎండిన పంటలను పరిశీలించిన, బాధిత రైతులకు భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలోనే.. సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 8:30 గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి జిల్లాల పర్యటనకు రోడ్డు మార్గంలో బయల్దేరుతారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10:30 గంటలకు చేరుకుంటారు.
అక్కడ ఎండిన పొలాలను పరిశీలించనున్నారు. 11:30కు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయల్దేరి.. 1:30 వరకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. అక్కడే భోజనం చేస్తారు.
అనంతరం మూడు గంటలకు మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతారు. మధ్యాహ్నం 3:30కు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి నల్లగొండ జిల్లాకు బయల్దేరుతారు. సాయంత్రం 4:30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి తిరిగి ఎర్రవెల్లికి బయల్దేరతారు. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి రాత్రి 9 గంటలకు ఫాంహౌజ్ చేరుకుంటారు.