
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ప్రతిపక్ష నేత ఛాంబర్ లో పూజలు చేసి ఎల్ఓపీ నేతగా భాద్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రలు హాజరయ్యారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుండి పోటీ చేసిన కేసీఆర్... కామారెడ్డిలో ఓడిపోయి.. గజ్వేల్ నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్ పై గెలిచారు. గజ్వేల్ నుంచి శాసనసభ్యుడిగా కేసీఆర్ ఎన్నిక కావడం ఇది మూడోసారి కావడం విశేషం.
గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రమాదవశాత్తు కాలు జారి తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రి పాలయ్యారు కేసీఆర్. ఆ తరువాత తుంటికి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు కేసీఆర్. ఇటీవల కోలుకున్న ఆయన... ఇవాళ అసెంబ్లీకి స్టిక్ సహయంతో వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు.