సీఎం రేవంత్​ను మా ఎమ్మెల్యేలు కలువడంలో తప్పులేదు : హరీశ్​రావు

సీఎం రేవంత్​ను మా ఎమ్మెల్యేలు కలువడంలో తప్పులేదు : హరీశ్​రావు
  • నియోజకవర్గ సమస్యలపై కలిశారేమో
  • 10 రోజుల్లో దిగిపోయే మోదీ ప్రాపకం కోసం రేవంత్​ పాకులాడుతున్నడు
  • మోదీని బడే భాయ్​ అనడం దేనికి సంకేతం?
  • ప్రజలతో పాటు కాంగ్రెస్‌‌నూ మోసం చేస్తున్నడు
  • మూడు నెలల్లో రూ. 16 వేల కోట్ల అప్పులు చేసిన్రు
  • కేసీఆర్​పై నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలే బుద్ధిచెప్తరు

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని కలవడంలో తప్పేమీ లేదని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు అన్నారు. నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారం కోసం వాళ్లు కలిశారేమోనని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రేవంత్‌‌‌‌ను ఎందుకు కలిశారో తనకు తెలియదని, ఆయన పార్టీ వీడుతున్నట్టుగా కూడా అధికారికంగా చెప్పలేదని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో హరీశ్​రావు చిట్​చాట్​ చేశారు. బీజేపీతో తమకు ఎటువంటి లాలూచీ లేదని, ఆ పార్టీ తమ ఎంపీలను లాగేసుకుంటున్నదని ఆరోపించారు.

కాంగ్రెస్‌‌‌‌కు, బీజేపీకి మధ్యనే లాలూచీ ఉందని, ఇది రేవంత్ వ్యాఖ్యలతోనే బయటపడిందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌‌‌‌ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదని రేవంత్‌‌‌‌రెడ్డి పరోక్షంగా చెప్పారని, మోదీనే మళ్లీ ప్రధాని అవుతారంటూ ఆదిలాబాద్‌‌‌‌ సభలో రేవంత్‌‌‌‌ సంకేతాలు ఇచ్చారని కామెంట్​ చేశారు. ‘‘వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూనే బీజేపీకి, మోదీకి రేవంత్ లవ్ లెటర్ రాసిండు. ఆయన ప్రజలతో పాటు, కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తున్నడు” అని విమర్శించారు.

పది, ఇరవై రోజుల్లో దిగిపోయే మోదీ ప్రాపకం కోసం రేవంత్​ పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తుందని, రాహుల్ ప్రధాని అవుతారని రేవంత్ నమ్మితే.. మోదీని బడే భాయ్ అని పొగడడం, గుజరాత్‌‌‌‌ మోడల్ కావాలంటూ ఆకాశానికి ఎత్తడం ఎందుకు?” అని ప్రశ్నించారు. రాహుల్, సోనియా ఆశీర్వాదం కంటే ఎక్కువగా, మోదీ ఆశీర్వాదం కోసమే రేవంత్‌‌‌‌ ఆరాటపడుతున్నారని అన్నారు.  ‘‘గుజరాత్‌‌‌‌ మోడల్ ఒక ఫెయిల్యూర్ అని, అక్కడ మత విద్వేషాల పేరిట అణచివేతలు జరుగుతున్నాయని రాహుల్ ఆరోపిస్తుంటడు. గుజరాత్ మోడల్ కావాలంటూ కాంగ్రెస్ సీఎం రేవంత్ అంటున్నడు.

మోదీ, అదానీ ద్వయం దేశాన్ని దోచుకుంటున్నదని రాహుల్ అంటడు. అదే అదానీతో రేవంత్ సంబంధాలు పెట్టుకుంటడు. ప్రేమగా వారిని ఆలింగనం చేసుకుంటడు. ప్రధాని మోదీ పట్ల రేవంత్‌‌‌‌ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని రాష్ట్ర బీజేపీ నాయకులు అంటున్నరు. రేవంత్‌‌‌‌ను చూసి నేర్చుకోవాలని, కర్నాటక బీజేపీ నాయకులు అక్కడి సీఎంగా ఉన్న కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు సూచిస్తున్నరు. ఈ వ్యవహారమంతా చూసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆశ్చర్యపోతున్నరు. ఏం మాట్లాడాలో తెల్వక మౌనంగా ఉంటున్నరు” అని హరీశ్‌‌‌‌ వ్యాఖ్యానించారు. 

ఆ ఉద్యోగాలన్నీ  మేము ఇచ్చినయే

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను, తాము ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని హరీశ్‌‌‌‌ దుయ్యబట్టారు. పోలీస్ ఉద్యోగాలు, స్టాఫ్ నర్స్‌‌‌‌ పోస్టులు, గురుకుల పోస్టులన్నింటికీ తమ ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చిందని, అప్పుడే ఎగ్జామ్స్ నిర్వహించి, మెరిట్ లిస్ట్ ప్రకటించామని, సర్టిఫికెట్ వెరిఫికేషన్లు కూడా పూర్తి చేశామని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక అపాయింట్‌‌‌‌మెంట్ లెటర్లు మాత్రమే ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నదని దుయ్యబట్టారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని హరీశ్ డిమాండ్ చేశారు.  

రాష్ట్రంలో  ఓ వైపు పంటలు ఎండిపోతుంటే, మరోవైపు ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పేరిట రైతుల రక్తం పీల్చి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజలకు ఇచ్చే సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌ను కూడా ఆపేశారని, సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌లో ఏదైనా అవినీతి జరిగితే విచారించి చర్యలు తీసుకోవాలని, కానీ మొత్తం స్కీమ్‌‌‌‌ను బంద్ పెట్టొద్దని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నీటి ఎద్దడి, కరువు పరిస్థితి మొదలైందని హరీశ్​రావు తెలిపారు.

రాజకీయాలను పక్కనబెట్టి మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయించి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పర్యటనపై స్పందిస్తూ.. ఐదేండ్ల కిందట కొట్టుకుపోయిన పోలవరం గురించే ఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ఏ ఇప్పటివరకూ రిపోర్ట్ ఇవ్వలేదని తెలిపారు. కానీ, మేడిగడ్డ రిపోర్టును మాత్రం కుంగినంక రెండో రోజే ఇచ్చారని అన్నారు. ఇదంతా పొలిటికల్ మోటివేటెడ్ రిపోర్టింగ్ అని ఆయన ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసేదేమీ లేదని, రాష్ట్ర సర్కార్ నేరుగా వెళ్లి నిర్మాణ పనులు మొదలు పెట్టొచ్చని అన్నారు. 

పెన్నులు.. గన్నులైనయా?

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి చిట్‌‌‌‌చాట్‌‌‌‌కు రిపోర్టర్ల మొబైల్స్‌‌‌‌ను, పెన్నులను అనుమతించకపోవడం ఏమిటని హరీశ్​రావు ప్రశ్నించారు. ‘‘అధికారంలోకి రాగానే రేవంత్‌‌‌‌కు పెన్నులు.. గన్నుల తీరుగా కనిపిస్తున్నయేమో. సెక్రటేరియట్ ఆరో ఫ్లోర్‌‌‌‌(సీఎం ఆఫీస్‌‌‌‌)లోకి రిపోర్టర్లను అనుమతించకపోవడం దారుణం. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు నిరంకుశం ఎవరిదో రిపోర్టర్లే చెప్పాలి” అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై రేవంత్ విమర్శలు చేయడం సరికాదన్నారు. ‘‘ఉద్యమ నాయకుడిపై నోటికొచ్చినట్టు మాట్లాడితే, ప్రజలే రేవంత్‌‌‌‌కు బుద్ధి చెప్తరు” అని హరీశ్‌‌‌‌  హెచ్చరించారు.

16 వేల కోట్ల అప్పులు చేసిన్రు

అడ్డగోలు అప్పులు చేసినట్లు తమను విమర్శించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే రూ.16 వేల కోట్ల అప్పులు చేసిందని హరీశ్‌‌‌‌రావు ఆరోపించారు. ఇంకా అప్పులు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఢిల్లీలో కేంద్ర సర్కార్ వద్ద లాబీయింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనను చూసి లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని రేవంత్‌‌‌‌ పిలుపునివ్వడాన్ని తాను స్వాగతిస్తున్నానని హరీశ్​రావు అన్నారు.

రేవంత్‌‌‌‌ చెప్తున్నట్టుగా ఈ వంద రోజుల పాలనను రెఫరండంగానే చూసి ఓట్లు వేయాలి. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా వంద రోజుల్లో  రూ.2 లక్షల రుణమాఫీ, 15 వేల రైతు బంధు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తేనే రైతులు ఆ పార్టీకి ఓటు వేయాలి. నిరుద్యోగ భృతి ఇస్తేనే నిరుద్యోగులు కాంగ్రెస్​కు ఓటు  వేయాలి” అని అన్నారు.