
- ఆయన నివాసానికి వెళ్లి కలిసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్
- ప్రకాశ్గౌడ్ కాంగ్రెస్లో చేరారంటూ సోషల్ మీడియాలో చర్చ
- నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానన్న ఎమ్మెల్యే
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్.. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ ప్రకాశ్గౌడ్కు కండువా కప్పి స్వాగతం పలికారు. దీంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్తున్నారంటూ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఆ వార్తలను ప్రకాశ్గౌడ్ ఖండించారు. మర్యాదపూర్వకంగానే సీఎంను తాను కలిశానని, బరాబర్ వంద సార్లు కలుస్తానని అన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి మాత్రమే రేవంత్ రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. తన నియోజకవర్గ పరిధిలోని కొత్వాల్గూడ, బహదూర్గూడ, ఘన్సిమియా గూడ గ్రామాల్లోని భూ సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిగా కోరానని తెలిపారు. రేవంత్ సానుకూలంగా స్పందించారని, అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వస్తున్న వార్తలు అబద్ధమని తేల్చి చెప్పారు. తాను బీఆర్ఎస్లోనే ఉంటానని, కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు. కాగా, ఇటీవల మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ఇంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్తోనూ ప్రకాశ్ గౌడ్ సమావేశమయ్యారు.
వరుసగా కలుస్తున్న బీఆర్ఎస్ నేతలు
గత మంగళవారం నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు కలిసి వెళ్లి.. సీఎంతో భేటీ అయ్యారు. ఈ విషయం రాజకీయంగా చర్చనీయాంశమవడంతో.. తెల్లారే ప్రెస్మీట్ పెట్టి మాట్లాడారు. తమకు సెక్యూరిటీ పెంపు, నియోజకవర్గాల అభివృద్ధి పనులపై చర్చించామని వారు అన్నారు. నియోజక అభివృద్ధి కోసం బరాబర్ సీఎంను కలుస్తామంటూ వారు చెప్పారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రకాశ్ గౌడ్ కూడా చేరారు. వీరే కాకుండా మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా సీఎంను కలిశారు. కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ నేత తీగల కృష్ణా రెడ్డి.. సచివాలయంలో రేవంత్తో భేటీ అయ్యారు. నిజానికి కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు కృష్ణా రెడ్డి దూరంగా ఉంటున్నారు. మహేశ్వరం టికెట్ ఆశించినా.. మళ్లీ సబితా ఇంద్రారెడ్డికే కేసీఆర్ చాన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు సీఎం రేవంత్ను కలవడంతో అదే విషయం మళ్లీ చర్చకు దారి తీసింది. రెండు రోజుల కిందట బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని సెక్రటేరియెట్లో కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే కలిశామని సీఎంతో భేటీ అయిన నేతలంతా చెప్తున్నా.. పార్టీ మారేందుకేనంటూ రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.