అదానీ గ్రూపు వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అదానీ ఎంటర్ప్రైజెస్పై హిండెన్బర్గ్ రీసర్చ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఢిల్లీలో ఎంపీలు మీడియాతో మాట్లాడారు. అదాని షేర్ల అంశంపై నోటీసులిచ్చామని, దానిపై చర్చ చేపట్టాలని స్పీకర్ను కోరినట్లు నామా నాగేశ్వరరావు తెలిపారు. పార్లమెంట్ లో దేశ సమస్యపై చర్చ జరగాలని కోరామని ఆయన తెలిపారు. ఏ సమస్యపై అయినా సభలో చర్చకు సిద్దం అంటారు.. కానీ చర్చించారని ఆరోపించారు. ఎల్ఐసీ డబ్బుపై ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన లేదన్నారు. సభలో ప్రభుత్వం తరఫున చర్చకు ముందుకు రావటం లేదన్నారు. పార్లమెంట్ లో దేశ సమస్యపై చర్చ జరిగేందుకు మా పోరాటం కొనసాగుతోందన్నారు.
లోక్సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చినట్లు ఎంపీ కేకే వెల్లడించారు. ఆర్థిక అంశం కాబట్టే వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ జరగాలని కోరామని అన్నారు. అదాని షేర్లు 27 శాతం పడిపోయాయని చెప్పారు. షేర్ల వ్యవహారంపై జేపీసీ లేదా సుప్రీంకోర్టుతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాపారస్తులు ప్రభుత్వ స్నేహితులుగా ఉన్నారని, అందే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. సభ ఆర్డర్లో లేదని వాయిదా వేయడం సరికాదని ఆయన విమర్శించారు. క్రోని కేపిటలిజం దేశాన్ని రూల్ చేస్తుంది ఆరోపించారు.
అదానీ అంశంపై అన్నిపార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ వ్యాపారస్తుల కోసమే మోదీ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాలను కూడగట్టుకుని పోరాటం చేస్తామన్నారు. జ్యుడీషియల్ విచారణ లేదా జేపీసీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తామన్నారు.