
- ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారం
- ఒక్కో సభకు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్లు
- జన సమీకరణ బాధ్యత కూడా అధికారులకే..
- మరో రూ.15 కోట్ల వరకు పార్టీ ఫండ్ పెడ్తున్న స్థానిక ఎమ్మెల్యేలు
- శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వేదికల పైనే ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు
నల్గొండ, వెలుగు : ప్రభుత్వ ఖర్చుతో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేస్తోంది. ఒక్క సభకు రూ. 2 నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు పెడ్తోంది. ఎన్నికల కో డ్ వస్తే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అవకాశం ఉండకపోవడంతో సర్కారు అధికారిక కార్యక్రమాలను స్పీడప్ చేసి, పనిలో పనిగా అవే వేదికలపై ప్రతిపక్షాలపై విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు, కంప్లీట్ చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తోంది. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఇతర శాఖల మంత్రులు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలతో హల్చల్ చేస్తున్నారు. పైకి ప్రభుత్వ కార్యక్రమాలు అని చెప్తున్నా గ్రౌండ్లో మాత్రం ఎన్నికల సభలనే తలపిస్తున్నాయి.
అప్పుడలా.. ఇప్పుడిలా..
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా సర్కారు ప్రతి నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున ఖర్చు చేసింది. అప్పుడు దశాబ్ధి ఉత్సవాల ఖర్చులు జిల్లా కలెక్టర్లు చెల్లించారు. దశాబ్ధి ఉత్సవాలకు జనాన్ని తరలించినట్టుగానే ఇప్పుడు నిర్వహిస్తున్న మంత్రుల కార్యక్రమాలకు జనాలను తీసుకొచ్చే బాధ్యత కూడా అధికారులే చూసుకోవాల్సి వస్తోంది. మహిళా సంఘాలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్ల సాయంతో సభలకు జనాన్ని రప్పిస్తున్నారు. మంత్రులతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, బ్యాంకు లింకేజీ చెక్కులు అందజేస్తామని చెప్పి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలను తరలిస్తున్నారు. ఇటీవల నల్గొండ, నకిరేకల్లో జరిగిన సభల ఏర్పాట్లు, అందుకు అధికారులు పెట్టిన ఖర్చు గురించి అధికార వర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. నకిరేకల్లో రెండు చోట్ల సభలు పెడితే ఆఫీసర్లు పెట్టిన ఖర్చు రూ.2 కోట్లు. అయితే, నల్గొండలో ఒక్క సభకే రూ.4 కోట్ల వరకు ఖర్చయినట్టు చెప్తున్నారు. ఇదే కాకుండా ఈ సభల కోసం నియోజకవర్గానికి రూ.15 కోట్ల వరకు ఎమ్మెల్యేలకు పార్టీ ఫండ్ను అధిష్టానం అందజేసినట్టు తెలిసింది. మామూలు నియోజకవర్గాలకు రూ.10 కోట్లు, పెద్ద నియోజకవర్గాలైతే రూ.15 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్టు సమాచారం. గ్రామాల నుంచి జనాలను తీసుకురావాలంటే ఒక్కొక్కరికి కనీసం రూ.500 నుంచి రూ.800 వరకు ఇస్తున్నామని బీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఖర్చుల భారం తమపై పడకుండా అన్నింటినీ పార్టీ హైకమాండ్చూసుకుంటోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పి బీఆర్ఎస్ లీడర్లు కలెక్టర్లు, ఎస్పీల అధికారాలను వాడుకుంటున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కరోజే రెండు, మూడు సభలు ప్లాన్చేయాల్సి రావడంతో అధికారులకు సవాల్గా మారింది. మరోవైపు ఎన్నికల కమిషన్నుంచి ఒత్తిడి, వరుస మీటింగులు, ఎన్నికల ఏర్పాట్లలో కలెక్టర్లు, ఎస్పీలు బిజీగా ఉండడంతో మంత్రుల పర్యటనలకు పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ ఖర్చుతో ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల కోడ్వస్తుందన్న భయంతో ఇప్పటికే రకరకరాల జీవోలు రిలీజ్ చేసి ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తోంది. ఇంకోవైపు జిల్లాలో అధికారికంగా జరగాల్సిన కార్యక్రమాలకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తోంది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల పేరిట ప్రజల సొమ్మును దుబారా చేసిన ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు నియోజకవర్గానికి రూ.10 కోట్ల వరకు పెడ్తోంది. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో ఎన్నికల సభలు పెడ్తోంది. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. – ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ
ప్రజలే గుణపాఠం చెప్తారు
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తరు. ఐదేండ్ల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా శంకుస్థాపనలు చేస్తోంది. ఎన్నికలకు ముందే కోట్లు ఖర్చు పెడ్తున్న సర్కార్పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. అధికారంలోకి రాలేమన్న భయంతోనే ఇదంతా చేస్తోంది.
– కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు