- వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం కాలేజీల్లో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్
- ఇంజినీరింగ్ విద్యా విధానంలో ఏఐసీటీఈ భారీ మార్పులు
- కొత్తగా ‘ఎక్స్పీరియెన్షియల్ లర్నింగ్ ప్రోగ్రామ్’కు గ్రీన్ సిగ్నల్
- టాప్ కాలేజీలకు మూడేండ్లకోసారి అఫిలియేషన్
- యూనివర్సిటీలూ ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాల్సిందే.. ఆదేశాలు జారీ
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ చదువును కొనసాగించేందుకు ఏఐసీటీఈ మరోసారి అనుమతి ఇచ్చింది. డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ కోర్సులను ఉద్యోగం చేస్తూనే పూర్తి చేసే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కాలేజీలు ‘ఫ్లెక్సిబుల్ టైమింగ్స్’ అమలు చేసుకోవచ్చని ప్రకటించింది. అంటే ఆఫీస్ వేళల తర్వాత సాయంత్రం పూట లేదా వీకెండ్స్లో క్లాసులు విని, డిగ్రీలు పొందే చాన్స్ ఇచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల దీన్ని అమలు చేస్తున్నా.. ఇకనుంచి ఎక్కువ సపోర్ట్ చేస్తామని తాజాగా ప్రకటించింది. ఇటీవల ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్కు పలు సవరణలు కూడా చేసింది.
పరిశ్రమల్లోనే పాఠాలు నేర్చుకునేలా..
ఇంజినీరింగ్ చదువులను కేవలం క్లాస్ రూమ్స్కే పరిమితం చేయకుండా.. నేరుగా పరిశ్రమల్లోనే పాఠాలు నేర్చుకునేలా ఏఐసీటీఈ నిర్ణయం తీసుకున్నది. 2026-–27 అకడమిక్ ఇయర్ నుంచి ‘ఎక్స్పీరియెన్షియల్ లర్నింగ్ ప్రోగ్రామ్స్’ పేరుతో కొత్త విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడుతున్నది. దీని ప్రకారం స్టూడెంట్స్ తమ కోర్సులో 50 శాతం వరకు సిలబస్ను నేరుగా కంపెనీల్లో పని చేస్తూ నేర్చుకోవచ్చు.
కేవలం ఇంటర్న్షిప్లాగా కాకుండా.. క్రెడిట్స్, పరీక్షలు, సర్టిఫికేషన్ అన్నీ ఇండస్ట్రీ, కాలేజీ కలిసి నిర్వహించనున్నాయి. కొత్తగా తెచ్చిన ఈ విధానం ప్రకారం.. డిప్లొమా విద్యార్థులు ఏడాదిన్నర, బీటెక్/డిగ్రీ విద్యార్థులు ఒక ఏడాదిపాటు పూర్తిగా ఇండస్ట్రీలోనే గడపాల్సి ఉంటుంది. అక్కడ థియరీతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుంటారు.
దీనికోసం నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ఉన్న కాలేజీలు లేదా ఇండస్ట్రీతో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కాలేజీలకే పర్మిషన్ ఇస్తారు. ఇక స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇచ్చే కంపెనీకి కనీసం రూ.100 కోట్ల టర్నోవర్ (మూడేండ్ల సగటు) ఉండాలి. అక్కడ స్టూడెంట్లకు క్లాసులు చెప్పేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్, ల్యాబ్స్, మెంటార్స్ ఉండాలి.
టాప్ కాలేజీలకు మూడేండ్లకోసారి అఫిలియేషన్..
ఇంజినీరింగ్ సీట్ల విషయంలోనూ ఏఐసీటీఈ కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే విద్యాసంవత్సరం (2026– -27) నుంచి ఇన్నాళ్లూ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్యపై ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
కాలేజీలో సరిపడా ఫ్యాకల్టీ, ల్యాబ్స్, క్లాస్ రూమ్స్ లాంటి మౌలిక వసతులు ఉంటే.. మేనేజ్మెంట్ కోరినన్ని సీట్లకు పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఎన్బీఏ గుర్తింపు ఉన్న కాలేజీలు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. మరోపక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఉన్నవి. న్యాక్ స్కోర్ 3.01 కంటే ఎక్కువ ఉన్నవి.
వరుసగా ఐదేండ్ల పాటు 80 శాతానికి పైగా అడ్మిషన్లు నమోదు చేస్తున్న టాప్ కాలేజీలకు ఇకపై ఏటా రెన్యువల్ అవసరం లేదు. వీటికి ఒకేసారి మూడేండ్ల పాటు అనుమతులు ఇవ్వనున్నారు. ఒకే సొసైటీ లేదా ట్రస్ట్ కింద నడిచే వేర్వేరు కాలేజీలు ఒకే సిటీ పరిధిలో ఉంటే.. వాటిని విలీనం చేసుకునేందుకు ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, బాగా రన్ అవుతున్న అటానమస్ కాలేజీలు, యూనివర్సిటీలు అదే పరిధిలో ‘ఆఫ్ క్యాంపస్’ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
యూనివర్సిటీలకూ పర్మిషన్ మస్ట్
ఇన్నాళ్లూ కొన్ని వర్సిటీలు ఏఐసీటీఈ అనుమతి లేకుండానే టెక్నికల్ కోర్సులను నడిపేవి. కానీ తాజా సవరణలో సుప్రీంకోర్టు తీర్పును (భారతిదాసన్ వర్సిటీ వర్సెస్ ఏఐసీటీఈ) ప్రస్తావిస్తూ.. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీలు ఏవైనా సరే టెక్నికల్ కోర్సులు నడిపితే ఏఐసీటీఈ ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఏఐసీటీఈ స్కీమ్స్, బెనిఫిట్స్ పొందాలంటే అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. దీనికి తగ్గట్టుగా ఏఐసీటీఈ ఆదేశాలిచ్చింది.
మరికొన్ని కీలక మార్పులివే..
- విదేశీ విద్యార్థుల కోసం ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో 15 శాతం, పీజీ కోర్సుల్లో 25 శాతం సూపర్ న్యూమరరీ (అదనపు) సీట్లను కేటాయించారు.
- ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్, లడఖ్, కేవలం మహిళల కోసం నడిచే కాలేజీలకు సెక్యూరిటీ డిపాజిట్లో 50 శాతం రాయితీ కల్పించారు.
- కాలేజీల్లో వసతుల తనిఖీకి వెళ్లే ‘ఎక్స్పర్ట్ విజిట్ కమిటీ’ (ఈవీసీ) ఇకపై ఫిజికల్గానే కాకుండా ఆన్లైన్ లేదా హైబ్రిడ్ మోడ్లోనూ తనిఖీలు చేయొచ్చు.
- ‘ఉల్లాస్’ స్కీమ్ కింద ప్రతి కాలేజీలో ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ కలిసి ఏడాదికి కనీసం ఐదుగురు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని సూచించింది.
- కాలేజీ క్యాంపస్లలో డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కింద కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
