కుప్పకూలిన 4 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు చిన్నారుల మృతి

కుప్పకూలిన 4 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు చిన్నారుల మృతి

దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి నాలుగంతస్తుల బిల్డింగ్ కుప్పకూలడంతో దాని కింద చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింది సుమారు 30 మందికిపైగా చిక్కుకుని ఉన్నారు. వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

నార్త్ ఢిల్లీలోని సబ్జీ మండీ ఏరియాలో మల్కా గంజ్‌ సమీపంలో ఉన్న నాలుగు అంస్తుల బిల్డింగ్ సోమవారం ఉదయం 11.50 గంటల సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలింది. ఈ ఘటనపై ఆ ఏరియాలో ఉన్న వాళ్లు వెంటనే పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది, ఎర్త్ మూవర్స్‌తో హుటాహుటీన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు, మరో వ్యక్తిని బయటకు తీయగా.. వాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే బిల్డింగ్ కూలిన సమయంలో ఆ ఇద్దరూ ఆ పక్క నుంచి నడిచి వెళ్తుండగా.. ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. అదే సమయంలో ఒక కారు కూడా అటుగా వెళ్తూ చిక్కుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ బిల్డింగ్‌లోని ఓ షాపులో కన్‌స్ట్రక్షన్‌ వర్క్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ షాపు ఓనర్‌‌పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.