రాజస్థాన్లో ఆదివారం (ఏప్రిల్ 14)న ఘోర విషాదం చోటుచేసుకుంది. చురు-సాలాసర్ హైవేపై ఓ కారు ట్రక్ వెనుక నుంచి ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సజీవదహనమైనట్లు పోలీసులు తెలిపారు. సికార్లోని ఫతేపూర్లో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హైవేపై వేగంగా వస్తున్న కారు పత్తిలోడ్ తో వెళ్తున్న ట్రక్కును ఢీకొనడంతో ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు కారుకి అంటుకున్నాయి.
కారులో ఉన్న ఆరుగురు బయటకు రాలేకపోయి అందులోనే కాలిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారు ఉత్తరప్రదేశ్ నంబర్ ప్లేట్ తో ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫతేపూర్, రామ్గఢ్, లక్ష్మణ్గఢ్ నుండి ఫైర్ సిబ్బంది చేరుకొని అరగంటలో మంటలు అర్పారు. కారులోంచి కాలిపోయిన ఆరుగురిని బయటకు తీశారు. మృతుల వివరాలు ఇంకా గుర్తించలేదు.