
తన కంపెనీలో పనిచేసే యువతితో పెట్టుకున్న అక్రమ సంబంధం.. తన చావుకే కారణమవుతుందని ఆ యజమాని ఊహించి ఉండడు. ఢిల్లీలో నవంబర్ 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన 46 ఏళ్ల నీరజ్ గుప్తా వ్యాపారవేత్త. ఆయన తన కంపెనీలో పనిచేసే 29 ఏళ్ల ఫైసల్తో గత పదేళ్ల నుంచి అక్రమసంబంధం నడుపుతున్నాడు. అయితే ఈ మద్యే ఫైసల్కు జుబెర్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. దాంతో ఆ విషయాన్ని ఫైసల్.. తన యజమాని నీరజ్ గుప్తాకు తెలిపింది. ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్న నీరజ్.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా..కేవాల్ పార్క్ సమీపంలోని ఆదర్శ్ నగర్లోని ఫైసల్ ఇంటికెళ్లి మరీ ఆమె తల్లితో, ఆమెకు కాబోయే భర్త జుబెర్తో నీరజ్ గొడవపెట్టుకున్నాడు.
గొడవ పెద్దది కావడంతో నీరజ్ సహనం కోల్పోయి జుబెర్ను నెట్టివేశాడు. దాంతో కోపోద్రిక్తులైన జుబెర్, ఫైసల్, ఆమె తల్లి షాహనాజ్లు నీరజ్పై దాడికి దిగారు. జుబెర్ ఇటుకతో నీరజ్ తలపై కొట్టి.. కత్తితో కడుపులో మూడుసార్లు పొడిచాడు. ఆ తర్వాత కత్తితో నీరజ్ గొంతు కోశాడు. నీరజ్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. అతని మృతదేహాన్ని ఒక సూట్ కేసులో పెట్టుకొని క్యాబ్లో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో ప్యాంట్రీగా పనిచేసే జుబెర్ సూట్కేస్తో సహా రాజధాని ఎక్స్ప్రెస్లో ఎక్కి మృతదేహాన్ని గుజరాత్లోని భరూచ్ సమీపంలో పారవేశాడు.
అయితే తన భర్త నీరజ్ కనిపించకపోవడంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన ఫిర్యాదులో ఫైసల్తో తన భర్తకున్న అక్రమసంబంధం గురించి తెలిపి.. ఫైసల్ మీద అనుమానమున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. దాంతో పోలీసులు ఫైసల్ మీద దృష్టి పెట్టారు. ఆమె ఇంటి సమీపంలోనే నీరజ్ మిస్సైనట్లు గుర్తించారు. దాంతో ఫైసల్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసుల దర్యాప్తులో తామే హత్యచేసినట్లు ఒప్పుకోవడంతో ఫైసల్ మరియు ఆమె తల్లి షాహనాజ్, ఫైసల్కు కాబోయే భర్త జుబెర్లను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, ఇటుకను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి విజయంత ఆర్య తెలిపారు. నీరజ్ మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తదుపరి దర్యాప్తు ప్రారంభించామని ఆయన తెలిపారు.
For More News..