ఆటోను ఢీకొట్టిన కారు..నలుగురు మృతి

ఆటోను ఢీకొట్టిన కారు..నలుగురు మృతి

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు ఇస్లావత్ శ్రీను (35), ఆయన భార్య శాంతి, కుమారుడు రిత్విక్ (6)​, కుమార్తె రిత్విక(4), తల్లి పాప (60).. నాగార్జున సాగర్ సమీపంలోని బుడియా బాపు దేవుడిని దర్శించుకోవడం కోసం ఆటోలో వెళ్లారు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆటోలో ఆదివారం రాత్రి తిరుగు పయనమయ్యారు.

ఈ క్రమంలో గూడురు వైపు వెళ్తున్న ఆటోను మహబూబాబాద్ వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఇస్లావత్ శ్రీను, పాప, రిత్విక్, రిత్విక అక్కడికక్కడే మృతి చెంచారు. ఆటోడ్రైవర్ సద్దార్, శాంతి, కారులో ఉన్న ఐదుగురు గాయపడ్డారు. వారిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భోగి పండుగ వేళ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.