ఓవర్ ​స్పీడ్‌తో ఫుట్‌పాత్‌పైకి కారు

ఓవర్ ​స్పీడ్‌తో ఫుట్‌పాత్‌పైకి కారు
  • ప్రమాదంలో మొక్కలకు నీళ్లు పడుతున్న మహిళ మృతి
  • హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా కారులోని యువతి మృతి
  • యువకుడికి తీవ్ర గాయాలు.. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగిందన్న పోలీసులు

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన మొక్కలకు నీళ్లు పోస్తున్న మహిళను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళతో పాటు కారులో ఉన్న మరో యువతి మృతిచెందారు. కారు డ్రైవ్‌‌ చేస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌‌ వద్ద శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌‌పల్లి హెచ్‌‌ఎంటీ హిల్స్‌‌లోని ఆదిత్య హోమ్స్‌‌లో నివాసం ఉంటున్న రోహిత్‌‌ (25), అతని ఫ్రెండ్‌‌ కేపీహెచ్‌‌బీ కాలనీకి చెందిన జూనియర్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌ ఎస్‌‌.గాయత్రి (27)తో కలిసి శుక్రవారం ఉదయం హోలీ సెలబ్రేషన్స్‌‌ కోసం తన ఫోర్డ్‌‌ కారులో ఇంటి నుంచి బయలుదేరారు. సెలబ్రేషన్స్‌‌ తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో గచ్చిబౌలి విప్రో జంక్షన్‌‌ నుంచి ట్రిపుల్‌‌ఐటీ జంక్షన్‌‌ వైపు కారులో స్పీడ్‌‌గా వస్తున్నారు. వారి కారు అదుపు తప్పడంతో పల్టీలు కొట్టి.. అదే సమయంలో ఎల్లా హోటల్‌‌ మెయిన్ గేట్‌‌ వద్ద ఉన్న ఫుట్‌‌పాత్‌‌పై మొక్కలకు నీళ్లు పడుతున్న మహేశ్వరి (38) అనే మహిళను ఢీకొట్టింది. తర్వాత రోడ్డు పక్కనున్న డివైడర్‌‌‌‌ను ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో మహేశ్వరి అక్కడికక్కడే చనిపోయింది. కారు పల్టీలు కొడుతున్న సమయంలో కారులో ఉన్న యువతి ఎగిరి బయట పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ట్రీట్‌‌మెంట్‌‌ కోసం ఆస్పత్రి కి తరలించే లోపే మధ్యలోనే చనిపోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. నారాయణపేట జిల్లా లంకాల గ్రామానికి చెందిన మహేశ్వరి ఏల్లా హోటల్‌‌లో సర్వర్ రూమ్‌‌లో నివాసం ఉంటూ అక్కడే గార్డెనింగ్‌‌ పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. కారు డ్రైవ్‌‌ చేస్తున్న సమయంలో రోహిత్‌‌ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి సీరియస్‌‌గానే ఉందని చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.