కపిల్ దేవ్ బయోపిక్ '83'పై కేసు నమోదు

కపిల్ దేవ్ బయోపిక్ '83'పై కేసు నమోదు

భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒక్కరైన కపిల్ దేవ్ బయోపిక్ '83' బాలీవుడ్ లో తెరకెక్కించారు. 1983లో కపిల్ కెప్టెన్సీలో భారత్ ప్రపంచకప్ ను గెలుచుకుంది. వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నవంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రిలీజ్ కు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న సమయంలో ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
 
ఈ చిత్ర నిర్మాతలు చీటింగ్ చేశారంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ ఫిర్యాదు చేసింది. అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. ఈ చిత్రంలో పెట్టుబడులు పెట్టే ఆలోచనతో నిర్మాతలను కలిశారు. సినిమా హక్కులు ఇస్తామని చెప్పి రూ. 15.90 కోట్లు ఖర్చు చేయించారని... తీరా చూస్తే తమను మోసం చేశారంటూ కోర్టును ఆశ్రయించారు. చిత్ర నిర్మాతలపై ఐపీసీ 406, 420, 120బీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు.