అభిషేక్ రావు సీబీఐ కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు

అభిషేక్ రావు సీబీఐ కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయిన్పల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీని కోర్టు పొడగించింది. అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ స్పెషల్ జడ్జ్ జస్టిస్ ఎంకే నాగ్పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం విధించిన 3 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఇవాళ ఆయనను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అభిషేక్ సీబీఐ కస్టడీని పొడగించాలని పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజుల కస్టడీలో అభిషేక్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని, మరికొన్ని ఆధారాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. అందుకే ఆయన కస్టడీ మరో రెండు రోజులు పొడగించాలని అధికారులు కోర్టును అభ్యర్థించారు.

అయితే అభిషేక్ తరఫు న్యాయవాది మాత్రం కస్టడీ పొడగింపు పిటిషన్ను వ్యతిరేకించారు. రెండ్రోలుగా సీబీఐ అధికారులు ఎలాంటి విచారణ జరపలేదని అందుకే కస్టడీ పొడగించవద్దని, దర్యాప్తునకు అభిషేక్ పూర్తిగా సహకరిస్తారని న్యాయమూర్తికి విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి సీబీఐ అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల పాటు కస్టడీ పొడగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

మరోవైపు అరుణ్ పిళ్లైతో అభిషేక్కు సంబంధాలున్నాయని, వీరిద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. విచారణకు హాజరుకావాలని అరుణ్ పిళ్లైకు నోటీసులు ఇచ్చామని, అయితే ఆయన కూతురు హాస్పిటల్ లో అడ్మిట్ అయినందున విచారణకు హాజరుకాలేదని చెప్పారు. ఇదే కేసుకు సంబంధించి ముత్తా గౌతమ్ ను సైతం ప్రశ్నిస్తున్నట్లు సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయిన్పల్లిని సోమవారం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఢిల్లీకి తరలించారు. కోర్టు అనుమతితో ఆయనను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు లిక్కర్ స్కాంకు సంబంధించి వివిధ అంశాల గురించి ఆరా తీస్తున్నారు.