Delhi Liquor Scam : మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ సమన్లు

Delhi Liquor Scam : మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ సమన్లు

ఢిల్లీ  లిక్కర్ స్కాంలో కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఫిబ్రవరి 19న సీబీఐ హెడ్ ఆఫీసుకు రావాలని తనకు నోటీసులు ఇచ్చారని, గతంలోలాగే ఇప్పుడు కూడా విచారణకు సహకరిస్తానని మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. గతంలోనూ సీబీఐ అధికారులు తన ఇంట్లో సోదాలు చేయడంతో పాటు తన బ్యాంక్ లాకర్లను తనిఖీ చేసినా ఏం దొరకలేదన్న విషయాన్ని సిసోడియా గుర్తు చేశారు. దర్యాప్తునకు సహకరిస్తున్నా విచారణ పేరుతో పదే పదే వేధిస్తున్నారని సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఉత్తమ విద్యను ఆపడమే లక్ష్యంగా కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇదిలా ఉంటే కేసు దర్యాప్తులో భాగంగా మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా సీబీఐ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది.