CBSE కీలక నిర్ణయం:10వ తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు..2026 నుంచి అమలు

CBSE కీలక నిర్ణయం:10వ తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు..2026 నుంచి అమలు

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది.2026 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించి వారికి మెరుగైన అవకాశాలను కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ నిర్ణయం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 సిఫార్సులకు అనుగుణంగా తీసుకున్నారు. 

2026 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుంది. మొదటి దశ పరీక్షలు సాధారణంగా ఫిబ్రవరిలో జరుగుతాయి. రెండవ దశ పరీక్షలు మే నెలలో నిర్వహిస్తారు. విద్యార్థులు మొదటి దశ పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి.

రెండవ దశ పరీక్షలకు హాజరు కావడం విద్యార్థుల ఐచ్ఛికం. విద్యార్థులు తమ మార్కులను పెంచుకునేందుకు లేదా మొదటి దశలో ఉత్తీర్ణత సాధించని వారు ఈ పరీక్షలకు హాజరు కావచ్చు.

విద్యార్థులు రెండు పరీక్షలకు హాజరైనట్లయితే వారి అత్యుత్తమ స్కోరును తుది ఫలితాల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఇది JEE మెయిన్ పరీక్షల విధానాన్ని పోలి ఉంటుంది. పేపర్ వ్యాల్యూవేషన్.. విద్యాసెషన్ లో ఏడాదికి ఒకేసారి మాత్రమే వ్యాల్యూవేషన్ ఉంటుంది. 

విద్యార్థులపై బోర్డు పరీక్షల ఒత్తిడిని తగ్గించడం..వారికి అదనపు అవకాశం కల్పించడం..నేర్చుకునే వాతావరణాన్ని మరింత అనుకూలంగా మార్చడం లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ మార్పుతో విద్యార్థులు ఒకే పరీక్షా ఫలితంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు రెండు అవకాశాలను పొందుతారు.

పదవ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఏడాదికి రెండు సార్లు నిర్వహించేందుకు ఫిబ్రవరిలోనే CBSE ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. వీటిని విద్యార్థులు, పేరెంట్స్ అభిప్రాయం కోసం అందుబాటులో ఉంచారు. విద్యార్థులపై భారం తగ్గించేందుకు విద్యార్థులందరు ఏదైనా విద్యా సంవత్సరంలో రెండుసార్లు పరీక్షలు రాసుకునేందుకు అనుమతించాలని కొత్త జాతీయ విద్యావిధానం(NEP) సిఫార్సు చేసింది.