- ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగవంతం చేయాలని గడ్కరీ సూచన
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ
- హైదరాబాద్ – విజయవాడ హైవేను ఆరు లేన్లుగా, హైదరాబాద్ టు
- కల్వకుర్తి రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని రేవంత్ విజ్ఞప్తి
- 14 స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా అప్గ్రేడ్ చేయాలని వినతి
- నేషనల్ హైవేగా ప్రకటించేందుకు కేంద్రం ఓకే
- యుటిలిటీస్ తరలింపు ఖర్చు భరించేందుకూ అంగీకారం
న్యూఢిల్లీ, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగానికి అడ్డంకులు తొలగిపోయాయి. చౌటుప్పల్ నుంచి -ఆమన్గల్, -షాద్నగర్ మీదుగా -సంగారెడ్డి వరకు మొత్తం 182 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ రోడ్డును నేషనల్ హైవేగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని నేషనల్ హైవేగా ప్రకటించిన కేంద్రం.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తితో దక్షిణ భాగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ఢిల్లీలో సెంట్రల్ రోడ్ ట్రాన్స్ పోర్ట్, హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీతో ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను రేవంత్ ప్రస్తావించారు. రాష్ట్రంలోని నేషనల్ హైవేల విస్తరణ, 14 స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా అప్ గ్రేడ్ చేయడం తదితర అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ఆర్ఆర్ సౌత్ అంశాన్ని రేవంత్ ప్రస్తావించగా.. దాన్ని నేషనల్ హైవేగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు స్వీకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులను గడ్కరీ ఆదేశించారు. ఆర్ఆర్ఆర్కు సంబంధించి భూసేకరణ, విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని రేవంత్ కు సూచించారు.
యుటిలిటీస్ తరలింపు ఖర్చు కేంద్రానిదే..
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (చౌటుప్పల్-–భువనగిరి–తూప్రాన్–-సంగారెడ్డి–-కంది) సంబంధించి యుటిలిటీస్ తరలింపు (కరెంటు స్తంభాలు, పైప్ లైన్లు, కేబుళ్లు తదితర) ఖర్చుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 10 నెలల కింద ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖ రాశారు. అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి ఒప్పుకోకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్హెచ్ఏఐకు లేఖ పంపారు.
తాజాగా ఈ అంశాన్ని గడ్కరీ వద్ద ఆయన ప్రస్తావించారు. దీంతో యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర సర్కార్ భరించాలని మెలిక పెట్టిందెవరంటూ అధికారులపై గడ్కరీ సీరియస్ అయ్యారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరిస్తే, భవిష్యత్తులో టోల్ ఆదాయంలో సగం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు.
యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా, హైదరాబాద్–కల్వకుర్తి రహదారిని 4 లేన్లుగా విస్తరించాలని గడ్కరీకి రేవంత్ విజ్ఞప్తి చేశారు. 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ (కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని రేవంత్ కు సూచించారు.
నేషనల్ హైవేలుగా అప్గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ కోరిన రోడ్ల వివరాలివీ..
1. మరికల్–-నారాయణపేట్–-
రామసముద్ర (63 కి.మీ)
2. పెద్దపల్లి–-కాటారం (66 కి.మీ)
3. పుల్లూర్–-అలంపూర్-–జటప్రోలు–-
పెంట్లవెల్లి–-కొల్లాపూర్–-లింగాల్–-
అచ్చంపేట–-డిండి–-దేవరకొండ–-
మల్లేపల్లి–-నల్గొండ (-225 కి.మీ)
4. వనపర్తి–-కొత్తకోట–-గద్వాల–-
మంత్రాలయం (110 కి.మీ)
5. మన్నెగూడ–-వికారాబాద్–తాండూర్–-
జహీరాబాద్–-బీదర్ (134 కి.మీ)
6. కరీంనగర్–-సిరిసిల్ల–-కామారెడ్డి-–
ఎల్లారెడ్డి–-పిట్లం (-165 కి.మీ)
7. ఎర్రవెల్లి క్రాస్ రోడ్–గద్వాల-–
రాయిచూర్ (67 కి.మీ)
8. జగిత్యాల–-పెద్దపల్లి–-
కాల్వ శ్రీరాంపూర్–-కిష్టంపేట–-కల్వపల్లి–-
మోరంచపల్లి–-రామప్ప దేవాలయం–-
జంగాలపల్లి (164 కి.మీ)
9. సారపాక-–ఏటూరునాగారం (93 కి.మీ)
10. దుద్దెడ–-కొమురవెల్లి–
-యాదగిరిగుట్ట–-రాయగిరి క్రాస్రోడ్ (63 కి.మీ)
11. జగ్గయ్యపేట–-వైరా–
-కొత్తగూడెం (100 కి.మీ)
12. సిరిసిల్ల–-వేములవాడ–-కోరుట్ల (65 కి.మీ)
13. భూత్పూర్–-నాగర్కర్నూల్-–మన్ననూర్-–మద్దిమడుగు–-గంగలకుంట–-సిరిగిరిపాడు (166 కి.మీ)
14. కరీంనగర్–రాయపట్నం (60 కి.మీ)