కరోనా పేషెంట్ దేశంలోని ఏ ఆస్పత్రిలోనైనా చేరొచ్చు

కరోనా పేషెంట్ దేశంలోని ఏ ఆస్పత్రిలోనైనా చేరొచ్చు

పలు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కరోనా పేషెంట్లను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చింది. కొవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆస్పత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా, కొవిడ్ పాజిటివ్ టెస్టు రిపోర్టు లేకపోయినా కరోనా రోగిని చేర్చుకోబోమని ఏ ఆస్పత్రి నిరాకరించరాదని స్పష్టం చేసింది. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్పత్రులు ఈ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని తెలిపింది. 

కరోనా నిర్ధారణ అయిన, కరోనా అనుమానితుల  అంశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మూడంచెల మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాయలని సూచించినట్టు తన అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది. అంతేకాకుండా, దేశంలో పరిమితంగానే వ్యాక్సిన్ డోసుల లభ్యత ఉన్నందున ఒక్క విడతలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అమలు చేయలేకపోతున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది.

దేశంలో కరోనా సంక్షోభం క్రమంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.