ఫండ్స్ ఇయ్యరు.. పర్మిషన్లు ఇయ్యరు.. తెలంగాణకు అడుగడుగునా కేంద్రం కొర్రీలు..!

ఫండ్స్ ఇయ్యరు.. పర్మిషన్లు ఇయ్యరు.. తెలంగాణకు అడుగడుగునా కేంద్రం కొర్రీలు..!
  • రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టు అనుమతులు, హైవేలు పెండింగ్​
  • ఎయిర్​పోర్టులకూ కొర్రీలు
  • పలు సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్​లు వెనక్కి 
  • 3 టీఎంసీ వాటర్ ​అలకేషన్స్​, టెక్నికల్​ క్లియరెన్స్​లూ ఇస్తలే
  • విభజన హామీల అమల్లోనూ మొండిచెయ్యి
  • ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేంద్ర మంత్రులను కలుస్తున్న సీఎం, మంత్రులు
  • రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ఫలితం సున్నా
  • అదే ఏపీకి అడిగిన వెంటనే ఫండ్స్​, పర్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టుల అనుమతులు మంజూరు కావడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. సీఎం రేవంత్​ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి  వెళ్లిన ప్రతిసారి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి ఈ సమస్యలను వివరించి.. నిధులు, అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఇక రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ లాంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు అందక పనులు నిలిచిపోతున్నాయి. విభజన హామీల అమల్లోనూ కేంద్రం మొండిచెయ్యి చూపుతున్నది.


ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌ల  పరిశీలన, నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం నుంచి కావాల్సినంత సానుకూల స్పందన లభించడం లేదని రాష్ట్ర అధికారులు అంటున్నారు. అదే సమయంలో ఏపీకి మాత్రం అడిగిన వెంటనే నిధులు, అనుమతులు మంజూరు అవుతుండటం గమనార్హం.

ఆ మూడు ప్రాజెక్టులు కేంద్రం దగ్గరే ఆగినయ్​

రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన రీజినల్ రింగ్ రోడ్డు  ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, నిధులు ఇంకా పెండింగ్‌‌‌‌లోనే ఉన్నాయి.  340 కిలో మీటర్ల పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్) హైదరాబాద్ చుట్టూ ఆరు లేన్ల ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేగా నిర్మాణం కావాలి.  ప్రాజెక్టు నార్త్​ (161.5 కిలో మీటర్లు), సౌత్​ ( 198 కిలో మీటర్లు) భాగాలుగా విభజించారు. అయితే ఉత్తర భాగంలో సంగారెడ్డి, తూప్రాన్, మెదక్ ప్రాంతాల్లో భూసేకరణ ఇటీవల పూర్తయింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ) టెండర్లు ఆహ్వానించినప్పటికీ ఇంకా వాటిని ఓపెన్​ చేయకపోవడంతో  నిర్మాణం  ఎప్పుడు మొదలవుతుందనే స్పష్టత కరువైంది. 

దక్షిణ భాగంలో అలైన్‌‌‌‌మెంట్ సమస్యలతో పాటు ఈ పార్ట్​ను కూడా కేంద్రమే నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా  ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ట్రిపుల్​ ఆర్​పై కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీని సీఎంతోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పది సార్లకు పైగా కలిశారు.   దీంతోపాటు హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-–2 విస్తరణ ప్రాజెక్టును కేంద్ర ఆమోదించాల్సి ఉంది.  ఇప్పటికే విస్తరణ డీపీఆర్ కేంద్రానికి చేరాయి.  ఈ దశలో 76.4  కిలో మీటర్ల పొడవైన ఐదు కారిడార్లను రూ.24,269 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదన ఉంది. 

ఓల్డ్ సిటీలో దారుల్‌‌‌‌షిఫా నుంచి ఫలక్‌‌‌‌నుమా వరకు మెట్రో మార్గం, నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట, మైలార్‌‌‌‌దేవ్‌‌‌‌పల్లి నుంచి కొత్తపేట వరకు కారిడార్లు ప్రతిపాదించారు.  అయితే కేంద్రం నుంచి బడ్జెట్ కేటాయింపు, ఆమోదం రాకపోవడంతో పనులు మొదలు కాలేదు. 2025  ఫిబ్రవరిలో ప్రధాని మోదీతో  సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయి.. ఈ ప్రాజెక్టు ఆమోదం కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇంకా ఫలితం లేదు. జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జికా) నుంచి రుణం కోసం ప్రాథమిక అనుమతి లభించినప్పటికీ కేంద్ర ఆమోదం లేక ఆగిపోయింది.  

మూసీ ప్రాజెక్టుకూ రూపాయి ఇయ్యలే..

మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా ఈసా, మూసీ నదుల సంగమ స్థలం బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధికి రక్షణ శాఖకు చెందిన 222.27 ఎకరాల భూమిని ఇవ్వాలని ఇప్పటికీ ఐదు సార్లు కేంద్రానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. ఈ స్థలంలో గాంధీ ఐడియాలాజికల్​ సెంటర్​, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మాణాన్ని ప్రతిపాదించారు. అయితే కేంద్రం ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో బాపూఘాట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా జరగలేదు. అలాగే మూసీ ప్రాజెక్టుకు రూ.20వేల కోట్ల నిధుల కోసం కేంద్రాన్ని రాష్ట్రం కోరినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క రూపాయి కేటాయించలేదు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల ఫైళ్లు వెనక్కి 

కేంద్రం వద్ద తెలంగాణకు చెందిన పలు ఇరిగేషన్​ ప్రాజెక్టులకు అనుమతులు పెండింగ్​లో ఉండిపోయాయి. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై ఇప్పటివరకూ తేల్చలేదు. పైగా ఆ ప్రాజెక్టు డిటెయిల్డ్​ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్​)ను కేంద్రం వెనక్కి పంపింది. శ్రీశైలం ఆఫ్​షోర్ నుంచి 90 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసుకునేలా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసింది. పట్టిసీమ ద్వారా తరలించే 80 టీఎంసీల నీటిలో 45 టీఎంసీలు ఏపీకి, 24 టీఎంసీలు కర్నాటకకు, మహారాష్ట్రకు 11 టీఎంసీలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీకి కేటాయించిన నీటికి సమానంగా నాగార్జునసాగర్​కు ఎగువన ఉన్న రాష్ట్రానికి కేటాయించాల్సి ఉంది.

 అంటే శ్రీశైలంలో 45 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఆ 45 టీఎంసీలతో పాటు.. చెరువుల ద్వారా ఆదా చేసిన మరో 45 టీఎంసీలను యాడ్ చేసి పాలమూరుకు రాష్ట్ర ప్రభుత్వం నీటి కేటాయింపులున్నట్టు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, కేంద్రం మాత్రం చెరువుల్లో ఆదా చేసిన 45 టీఎంసీలపై సరైన లెక్కలు లేవని, సైంటిఫిక్​గా మరోసారి లెక్కలు వేసి పంపాలని డీపీఆర్​లను  వెనక్కి పంపింది. దీనిపై రాష్ట్ర​ సర్కారు కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు.

 వైన్​గంగపై చేపట్టిన వార్ధా ప్రాజెక్టు డీపీఆర్​కూడా కేంద్రం వెనక్కి పంపింది. మహారాష్ట్రలో ముంపు ఉంటుందని, ఆ రాష్ట్రం నుంచి ఎన్‌‌‌‌వోసీ​తీసుకోవాలని సూచిస్తూ డీపీఆర్​ను తిప్పి పంపింది. అంతేగాకుండా కాళేశ్వరం థర్డ్​ టీఎంసీకి సంబంధించి కాస్ట్‌‌‌‌ బెనిఫిట్‌‌‌‌​రేషియోపై అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలంటూ ఆ ప్రాజెక్ట్​ డీపీఆర్‌‌‌‌‌‌‌‌నూ రివర్స్​ పంపింది. ఇక, తుపాకులగూడెం వద్ద కట్టిన సమ్మక్కసాగర్​ బ్యారేజీకి ఇప్పటిదాకా హైడ్రాలజీ క్లియరెన్సులూ ఇవ్వలేదు. 50 టీఎంసీలు లిఫ్ట్​ చేసుకునేలా ఈ ప్రాజెక్టును నిర్మించగా.. ఇంతవరకు కేంద్రం క్లియర్‌‌‌‌‌‌‌‌ చేయలేదు. 

ఎయిర్ పోర్టులకూ కొర్రీలు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్‌‌‌‌పోర్టులకు సంబంధించి కూడా కేంద్రం నుంచి ఆశించినంత వేగంగా అనుమతులు లభించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇది రాష్ట్రంలో విమానయాన రంగానికి, తద్వారా పర్యాటకం, వాణిజ్య అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నది.  తెలంగాణలో వరంగల్ (మామునూరు), భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, నిజామాబాద్,  పాల్వంచ, పెద్దపల్లి ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌‌‌‌పోర్టుల నిర్మాణానికి ప్రణాళికలు ఉన్నాయి. 

వరంగల్ మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లు విడుదల చేసింది. ఈ పనులు కూడా నడుస్తున్నాయి.  అయితే, ఆదిలాబాద్, నిజామాబాద్‌‌‌‌కు సాధ్యాసాధ్య నివేదికలు సానుకూలంగా ఉన్నప్పటికీ కేంద్రం కొర్రీలు పెడుతున్నది.  భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, పాల్వంచ, పెద్దపల్లిలో ప్రాథమిక ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కేంద్రం నుంచి గ్రీన్​ సిగ్నల్ లేక ఆగిపోయాయి.  

కేంద్ర మంత్రులను కలుస్తున్నా..

సీఎం రేవంత్​రెడ్డితోపాటు  రాష్ట్ర మంత్రులు, అధికారులు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌‌‌‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతుల గురించి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలను, ప్రాధాన్యతలను వారికి వివరిస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నది. 

రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు (కిషన్‌‌‌‌ రెడ్డి, బండి సంజయ్) కేంద్ర కేబినెట్‌‌‌‌లో ఉన్నప్పటికీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల విషయంలో వారు పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇచ్చిన విభజన హామీల అమల్లోనూ కేంద్రం మొండిచెయ్యే చూపుతున్నదనే విమర్శలున్నాయి.

ఏపీకి అడిగిన వెంటనే..

తెలంగాణకు అన్నింట్లో మొండిచెయ్యి చూపిస్తున్న కేంద్రం.. ఏపీకి మాత్రం అడిగిన వెంటనే నిధులు, ప్రాజెక్టుల అనుమతులు ఇస్తున్నదని తెలంగాణ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది కేంద్రం పక్షపాత వైఖరికి నిదర్శనమని, తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నదని వారు విమర్శిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీ రాజధాని నిర్మాణానికి సహాయం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఫండ్స్​, బనకచర్లకు సానుకూలంగా స్పందించడం వంటి  అంశాల్లో ఏపీకి లభించిన సహకారం తెలంగాణకు లభించడం లేదని వారు ఉదాహరణగా చూపుతున్నారు.  

అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్లు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తికి పూర్తి నిధుల మద్దతు, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటు జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు, కొప్పర్తి, ఒరవాకల్ ఇండస్ట్రియల్ నోడ్‌‌‌‌లకు కేంద్రం  నిధులు కేటాయించింది. అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.13వేల కోట్ల రుణం, కేంద్రం నుంచి రూ.1,500 కోట్ల గ్రాంట్ లభించాయి. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు, రాష్ట్ర హైవేల నిర్మాణానికి రూ.4,770 కోట్లు కేంద్రం భరించింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,418 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు తొలి దశలో రూ. 22వేల కోట్ల నిధులు కోరుతూ కేంద్రానికి డీపీఆర్ లు పంపగా సానుకూలంగా స్పందించింది. ఏపీలో 7 కొత్త ఎయిర్ పోర్ట్ లను అభివృద్ధి చేసేలా ప్రపోజల్స్​ సిద్ధం చేయగా.. వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది.