మెహదీపట్నంలో స్కైవాక్ కు లైన్ క్లియర్.. భూములిచ్చేందుకు కేంద్రం ఓకే

మెహదీపట్నంలో స్కైవాక్ కు లైన్ క్లియర్.. భూములిచ్చేందుకు కేంద్రం ఓకే

హైదరాబాద్ మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. స్కైవాక్  నిర్మాణానికి  భూమి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు  త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. 

పెరిగిన ట్రాఫిక్‌ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక్కడ స్కై వే నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచే ఉన్నాయి. రైతు బజార్ ప్రాంతంలో ఉన్న తమ భూములను ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించకపోవటంతో పీటముడి పడింది. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటంతో స్కై వాక్ పనులు నిలిచిపోయాయి. 

సీఎం రేవంత్ అధికారం చేపట్టాక..  జనవరి 5న ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్రరక్షణ శాఖ మంత్రిని కలిసి ఈ విషయంపై చర్చించారు. అక్కడున్న ఢిఫెన్స్ జోన్ కు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కై వే డిజైన్ లో సీఎం పలు మార్పులు చేయించారు. సవరించిన కొత్త ప్రతిపాదనలను ఇటీవలే కేంద్రానికి పంపించారు.  దీంతో లేటెస్ట్ గా భూ కేటాయింపునకు కేంద్రం ఆమోదం తెలిపింది.

మొత్తం 3,380 చదరపు గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించనుంది. బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం ఢిపెన్స్ విభాగానికి రూ.15.15 కోట్ల విలువైన మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. మరి కొంత స్థలానికి పదేండ్ల పాటు లైసైన్స్ రుసుం చెల్లించాలనే నిబంధన విధించింది. నాలుగు వారాల్లోనే ఈ భూములను అప్పగించేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించింది.  దీంతో వీలైనంత వేగంగా ఈ స్కైవే నిర్మాణం చేపట్టాలని  సీఎం రేవంత్ అధికారులను  ఆదేశించారు.