- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: ఉత్తర తెలంగాణలోని క్రీడా మౌలిక వసతుల కల్పనలో భాగంగా మూడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది. సోమవారం లోక్సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆమోదించిన ప్రతిపాదనలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 4 లేన్ల, 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.6.50 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
ఆమోదం పొందిన ప్రాజెక్టులను రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. అయితే, ఈ స్కీం కింద తెలంగాణలోని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో రూ.16 కోట్ల అంచనాతో మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని, అయితే 2021–26 కాలానికి సంబంధించి ఖేలో ఇండియా స్కీం గడువు ముగిసినందున ప్రస్తుతం కొత్త ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఎంపీ చామల అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
