గ్రేటర్ వరంగల్, వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం కింద చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుండి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ 95 శాతానికి పైగా పూర్తయిందని, తెలంగాణలో కూడా అదే స్థాయిలో పురోగతి సాధించేందుకు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈఆర్ఓలు, ఏఈఆర్వోలు తమ పరిధిలోని బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓలు), సూపర్వైజర్లకు స్పష్టమైన దిశానిర్దేశం అందిస్తూ క్షేత్రస్థాయిలో పనులను క్రమబద్ధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి, రెవెన్యు అదనపు కలెక్టర్ జి.సంధ్యా రాణి, జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విడియో కాన్ఫరెన్స్ లో సూచించిన సూచనలు పాటిస్తూ 10 రోజుల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తి చేస్తామన్నారు. ఈ వీడియో సమావేశంలో వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ,ఉమారాణి, సంబంధిత మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

