ఫెమస్ 'చాయ్వాలాస్' స్టార్టప్ వ్యవస్థాపకుడు రోహిత్ శర్మ(30) బలవన్మరణానికి పాల్పడ్డారు. రాజస్థాన్లోని దౌసాలో శనివారం మధ్యాహ్నం ఆయన తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కుటుంబ సభ్యులు గమనించి తలుపులు పగలకొట్టి, ఆయన్ను కిందికి దించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కోత్వాలి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు.
కుటుంబ నేపథ్యం, వ్యాపార ప్రయాణం..
రోహిత్ శర్మ తండ్రి హితేంద్ర మోహన్ శర్మ మెడికల్ షాప్ నిర్వహిస్తుండగా.. భార్య ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.
కేవలం 17 ఏళ్ల చిన్న వయసులోనే నర్సింగ్ చదువుతూనే రోహిత్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. జైపూర్లోని మానసరోవర్ ప్రాంతంలో 'చాయ్వాలాస్' పేరుతో తొలి టీ కేఫ్ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వ్యాపారాన్ని విస్తరించి జైపూర్తో పాటు ఇతర నగరాల్లో కలిపి మొత్తం 7 అవుట్లెట్లను నడిపారు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారడంతో సుమారు ఆరు నెలల క్రితం షిప్రా పాత్ కేఫ్ను మూసివేశారు.
►ALSO READ | మరో ఉద్యమానికి సిద్ధమైన కాక్రోచ్ పార్టీ.. ఈ సారి సీఎం పోస్ట్కే ఎసరు..?
వ్యాపారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్న రోహిత్.. దౌసా నగరంలో 'మిషన్ హెల్ప్లైన్'ను నడిపారు. అంతేకాకుండా 2024లో జరిగిన దౌసా అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ ఆయన నామినేషన్ వేశారు. అయితే బీజేపీ నేతలు నచ్చజెప్పడంతో ఆ తర్వాత నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడాయన ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషదాన్ని నింపింది.
