చందానగర్, వెలుగు : వైజాగ్ నుంచి హైదరాబాద్కు హాష్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 4 లక్షల విలువైన 760 గ్రాముల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ రఘు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా తుర్కపేట గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్(32) అల్లాపూర్లో నివాసముంటున్నాడు. విశాఖపట్నం అల్లిపోరం గ్రామానికి చెందిన సాయికుమార్(28) స్థానికంగా బిర్యానీ అమ్ముతుంటాడు. వీరిద్దరూ కలిసి విశాఖపట్నానికి చెందిన రాజారావు వద్ద హాష్ ఆయిల్ కొనుగోలు చేసి అక్కడి నుంచి ట్రైన్లో హైదరాబాద్కు వచ్చారు.
ఆదివారం రాత్రి లింగంపల్లి రైల్వేస్టేషన్లో దిగిన ఇద్దరు కూకట్పల్లి వెళ్లేందుకు ఆటో మాట్లాడుకొని బయలుదేరారు. లింగంపల్లి రైల్వే అండర్బ్రిడ్జి వద్ద వెహికిల్చెకింగ్ చేస్తున్న చందానగర్ పోలీసులను చూసిన ప్రవీణ్, సాయి ఆటో దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి వద్ద ఉన్న బ్యాగ్ను చెక్ చేయగా 760 గ్రాముల హాష్ ఆయిల్ గుర్తించారు. ప్రవీణ్ వైజాగ్ నుంచి హాష్ ఆయిల్ను హైదరాబాద్కు కూకట్పల్లిలో ఉన్న కస్టమర్లకు విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.