
హైదరాబాద్, వెలుగు: పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటూ సవాల్ విసురుతున్న చెడ్డీ గ్యాంగ్ దొరికిందా? వరుస దోపిడీలు చేస్తూ జనానికి నిద్ర లేకుండా చేస్తున్న ముఠా ఆటకట్టించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల్లోనే 7 దోపిడీలకు పాల్పడి, పోలీసుల నుంచి తప్పించుకుపోయిన గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయా దోపిడీలకు సంబంధించిన కేసుల దర్యాప్తును ముమ్మరం చేసిన రాచ కొండ పోలీసులు, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్లలో ముఠా సభ్యుల ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో గుజరాత్లో వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. అక్టోబర్ 24, నవంబర్ 22న కుంట్లూర్లో దొంగల ముఠా దోపిడీలకు పాల్పడిన సంగతి తెలిసిందే.
10 స్పెషల్ టీమ్స్తో సెర్చ్
చెడ్డీ గ్యాంగ్ కేసును చాలెంజింగ్గా తీసుకున్న రాచకొండ సీపీ మహేశ్భగవత్.. స్పెషల్ టీములు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ నేతృత్వంలోని 10 స్పెషల్ టీములు చెడ్డీ గ్యాంగ్ కోసం నాలుగు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టాయి. సీసీఎస్ పోలీసులతో పాటు ఎస్వోటీ, ఐటీ సెల్ టీములు ఉత్తర్ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్లలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. కుంట్లూరు చోరీ తర్వాత నిజామాబాద్, ఏపీలో చోరీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. చెడ్డీగ్యాంగ్ తిరిగిన చోట సీసీటీవీ ఫుటేజ్, వేలి ముద్రలను తీసుకున్నారు. దానికి తోడు పాత నేరస్తుల డేటా ఆధారంగా పోలీసులు చెడ్డీ గ్యాంగ్ కదలికలను గుర్తించారు. అవే కేసు పురోగతికి తోడ్పడ్డాయని పోలీసులు
చెబుతున్నారు.
ఇవీ చెడ్డీ గ్యాంగ్ చోరీలు
అక్టోబర్ 24న హైదరాబాద్ శివారులోని హనుమాన్నగర్ యాజ్ఞికపీఠం వేద పాఠశాలతో పాటు మరో మూడు ఇళ్లలో చెడ్డీ గ్యాంగ్ దోపిడీ చేసింది. ఇనుప రాడ్లు, కర్రలతో బెదిరించి దోపిడీలకు పాల్పడ్డారు. 15 తులాల నగలు, రూ.1.5 లక్షలు ఎత్తుకెళ్లారు. హనుమాన్నగర్ కాలనీలోని అంజిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 5 తులాల బంగారం, రూ.50 వేలు దోచుకెళ్లారు. తర్వాత ఓ గుడిసెలో మొబైల్ఫోన్, సత్తిరెడ్డికాలనీలోని యాజ్ఞిక పీఠం వేద పాఠశాలలో చోరీ చేశారు. వేద పాఠశాల నిర్వాహకులు కిశోర్ స్వామి, ఆయన భార్యను బెదిరించి పుస్తెలతాడు, బంగారు గాజులు, కమ్మలతో పాటు రూ.లక్ష దోచుకెళ్లారు. నవంబర్ 22న అరగంటలో రెండు ఇళ్ల తలుపులను పగులగొట్టి రాడ్లు, కర్రలు, కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడింది. 20 తులాల బంగారం రూ.75 వేలు చోరీ చేసింది.