సెలబ్రిటీ చెఫ్​.. రణ్‌‌‌‌‌‌‌‌వీర్​.. చాలా తక్కువ టైంలోనే.. యూట్యూబ్​లో ఫేమస్ ఎలా అయ్యాడంటే..

సెలబ్రిటీ చెఫ్​.. రణ్‌‌‌‌‌‌‌‌వీర్​.. చాలా తక్కువ టైంలోనే.. యూట్యూబ్​లో ఫేమస్ ఎలా అయ్యాడంటే..

ఆయనకు చిన్నప్పటినుంచే ఫుడ్​తో విడదీయలేని అనుబంధం ఉండేది. ఆటలు ఆడుతున్న వయసులోనే వీధుల్లో తిరుగుతూ.. హోటళ్లలో వండే వంటకాలను, వండే విధానాన్ని గమనించేవాడు రణ్​వీర్. ఆ ఇష్టమే అతన్ని ఇండియాలోని టాప్​ చెఫ్​ల్లో ఒకరిగా నిలిచేలా చేసింది. అంతేకాదు.. అమెరికాలో రెస్టారెంట్​ పెట్టి ఆయన చేతి వంట రుచిని అక్కడివాళ్లకు చూపించాడు. ఎప్పుడూ టీవీలో కనిపించే సెలబ్రిటీ చెఫ్​గా గుర్తింపు దక్కించుకున్న ఆయన.. తన అభిమానులకు దగ్గరయ్యేందుకు యూట్యూబ్​ చానెల్‌‌‌‌‌‌‌‌ కూడా పెట్టాడు. అందులో కొత్త కొత్త వంటకాలతో పాటు అనేక కిచెన్​ చిట్కాలు చెప్తున్నాడు. 

రణ్​వీర్​ సింగ్ బ్రార్ 1978 ఫిబ్రవరి 8న లక్నోలో ఒక జాట్​ సిక్కు కుటుంబంలో పుట్టాడు. లక్నోలోని ఫుడ్​ కల్చర్​ ఆయనకు కుకింగ్​ మీద ఆసక్తి పెరిగేలా చేసింది. చిన్నతనంలో స్థానిక కబాబ్ దుకాణాల్లో చేసే వంటకాలను ఇంట్రెస్ట్‌‌‌‌‌‌‌‌గా చూసేవాడు. 13 సంవత్సరాల వయసులోనే స్థానిక గురుద్వార్​లో అప్పుడప్పుడు స్వీట్ రైస్ వండేవాడు. ఆ తర్వాత 17 ఏండ్ల వయసులో ప్రసిద్ధ కబాబ్ వెండర్​ మునీర్ ఉస్తాద్ దగ్గర కుకింగ్​ ట్రైనింగ్​ తీసుకున్నాడు. ఆ టైంలోనే రణ్​వీర్​ ఎలాగైనా కలినరీ కెరీర్​ని ఎంచుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాడు. కానీ.. అమ్మానాన్నలు మాత్రం ఇంజినీరింగ్ లేదా డిఫెన్స్​ సర్వీస్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగంలో చేరాలని చెప్పారు. వాళ్ల మాటలు వినిపించుకోకుండా రణ్​వీర్​ మాత్రం లక్నోలోని ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ (ఐహెచ్​ఎం)లో చేరాడు. 

ఇలా ఫేమస్

రణ్‌‌‌‌‌‌‌‌వీర్ తన వ్లాగ్స్​లో రకరకాల వంటలు చేస్తుంటాడు. ముఖ్యంగా భారతదేశ వంటకాల వారసత్వాన్ని కాపాడేందుకు ధాన్యాలు, హైపర్‌‌‌‌‌‌‌‌లోకల్ వంటకాల మీదే ఎక్కువగా వీడియోలు చేస్తుంటాడు. దాంతోపాటే కుకింగ్​, కిచెన్​ టిప్స్​ చెప్తుంటాడు.  ప్రత్యేక వంటకాలను వండేటప్పుడు దాని వెనుక ఉన్న చరిత్రను, ఆ ఫుడ్​ తినడం వల్ల కలిగే లాభాలను వివరిస్తుంటాడు. అందుకే చాలా తక్కువ టైంలోనే యూట్యూబ్​లో ఫేమస్​ అయ్యాడు. 

రణ్​వీర్ వీడియోల వల్ల వంట నేర్చుకోవడమే కాదు.. వ్యూయర్స్​ కొంత జ్ఞానాన్ని కూడా పొందుతారు. రణ్​వీర్​ యాక్టింగ్​లోకి కూడా అడుగుపెట్టాడు. 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ‘మోడరన్ లవ్ ముంబై’లో నటించాడు. డిస్కవరీలో వచ్చిన ‘స్టార్ వర్సెస్ ఫుడ్ సర్వైవల్’​లో కనిపించాడు. రణ్​వీర్​ ‘కం ఇన్​టు మై కిచెన్’ పేరుతో ఆత్మకథను కూడా రాశాడు. తన వంటకాల జర్నీని అందులో వివరించాడు. అంతేకాదు.. ‘ఫోర్బ్స్ ఇండియా’ ప్రకారం..ఆయన ఇండియాలో అత్యధికంగా సంపాదించే రెండో సెలబ్రిటీ షెఫ్‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు దక్కించుకున్నాడు.

యూట్యూబ్​ జర్నీ.. 

రణ్​వీర్​ 2013లోనే ‘చెఫ్ రణ్​వీర్​ బ్రార్​’ పేరుతో చానెల్​ పెట్టాడు. కానీ.. 2016లో తన మొదటి వీడియో అప్​లోడ్ చేశాడు. క్రమంగా సబ్​స్క్రయిబర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అది 2020లో 2 మిలియన్లకు చేరింది. ప్రస్తుతం చానెల్‌‌‌‌‌‌‌‌ని 8.43 మిలియన్ల మంది సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. చానెల్‌‌‌‌‌‌‌‌లో పది మిలియన్ల వ్యూస్​ దాటిన వీడియోలు మూడు ఉన్నాయి. కానీ.. మిలియన్‌‌‌‌‌‌‌‌ వ్యూస్​ దాటినవి మాత్రం చాలా ఉన్నాయి. ఇప్పటివరకు చానెల్‌‌‌‌‌‌‌‌లో 1,450 వీడియోలు అప్​లోడ్​ చేశాడు.

తాజ్​మహల్​లో.. 

రణ్​వీర్​ చదువు పూర్తైన తర్వాత న్యూ ఢిల్లీలోని తాజ్​మహల్ హోటల్‌‌‌‌‌‌‌‌లో కిచెన్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రైనీగా జీవితాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత 25 ఏండ్ల వయసులోనే నోయిడాలోని రాడిసన్ బ్లూ హోటల్‌‌‌‌‌‌‌‌లో ఎగ్జిక్యూటివ్ షెఫ్‌‌‌‌‌‌‌‌గా పనిచేశాడు. ఈ హోదా దక్కించుకున్న ఇండియాలోనే చిన్న వయస్కుడిగా రికార్డ్‌‌‌‌‌‌‌‌ క్రియేట్​ చేశాడు. 2001లో గోవాలోని ఫోర్ట్ అగువాడ బీచ్ రిసార్ట్‌‌‌‌‌‌‌‌లో మూడు రెస్టారెంట్లు మోరిస్కో (సీఫుడ్), ఇల్ కామినో (ఇటాలియన్), ఫిష్‌‌‌‌‌‌‌‌టైల్ (ఓపెన్-ఎయిర్ బార్బెక్యూ) ప్రారంభించాడు. అక్కడ సక్సెస్​ అయిన తర్వాత ఆయన చూపు అమెరికాపై పడింది. మసాచుసెట్స్‌‌‌‌‌‌‌‌లోని బోస్టన్ సిటీలో బ్యాంక్యూ పేరుతో ఫ్రాంకో–ఏషియన్ రెస్టారెంట్​ని మొదలుపెట్టాడు. 

అందుకోసం వన్ వరల్డ్ హాస్పిటాలిటీ గ్రూప్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేశాడు. కానీ.. ఆ రెస్టారెంట్ ఒకటిన్నరేండ్లకే మూతపడింది. దానివల్ల రణ్​వీర్​ చాలా నష్టపోయాడు. దాంతో కొన్నాళ్లపాటు డిప్రెషన్​లోకి వెళ్లిపోయాడు. 2012లో తన తండ్రికి క్యాన్సర్ రావడంతో ఇండియాకి తిరిగి వచ్చాడు.ఆ తర్వాత రణ్​వీర్​ ముంబైలో ఒక హోటల్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్నప్పుడు కలిసిన షెఫ్ పల్లవిని 2013లో పెండ్లి చేసుకున్నాడు.

మళ్లీ బిజినెస్​

ఇండియాలో రణ్​వీర్​ అక్కోర్ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో చేరి మళ్లీ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌ బిజినెస్​ చేశాడు. ఢిల్లీ, చండీగఢ్, ముంబైలో రెస్టారెంట్లు పెట్టాడు. అంతేకాదు.. రణ్​వీర్​ రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ లైనర్లకు, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లోని అలిలా ఫోర్ట్ బిషంగఢ్‌‌‌‌‌‌‌‌కు మెనూలను రూపొందించాడు. ఇలా బిజినెస్​లతోపాటు రణ్​వీర్​ రెగ్యులర్​గా టీవీషోలకు గెస్ట్‌‌‌‌‌‌‌‌గా కూడా వెళ్తుండేవాడు. దాంతో చాలా ఫేమస్​ అయ్యాడు. ఆయన ది గ్రేట్ ఇండియన్ రసోయ్, హెల్త్ భీ టేస్ట్ భీ, నార్తర్న్ ఫ్లేవర్స్ – మీఠీ మస్తీ, స్టేషన్ మాస్టర్స్ టిఫిన్, హిమాలయాస్ ది ఆఫ్‌‌‌‌‌‌‌‌బీట్ అడ్వెంచర్.. ఇలా అనేక షోలను హోస్ట్ చేశాడు.

 మాస్టర్‌‌‌‌‌‌‌‌షెఫ్ ఇండియా మూడు సీజన్‌‌‌‌‌‌‌‌లకు జడ్జిగా ఉన్నాడు. టెలివిజన్ షోలు గుర్తింపును తెచ్చిపెట్టినప్పటికీ అందులో ఆయనకు కావాల్సినంత స్వేచ్ఛ దొరకలేదు. అందుకే టీవీషోలు చేస్తున్నప్పుడే యూట్యూబ్​లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. “టీవీ నాకు గుర్తింపును ఇచ్చింది. కానీ.. యూట్యూబ్  స్వేచ్ఛను ఇచ్చింది. నేను చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని యూట్యూబ్​ ద్వారాపంచుకోగలుగుతున్నా” అన్నాడు రణ్​వీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.