
- శంషాబాద్ ఎయిర్పోర్టుకు రెండుసార్లు..
- చెన్నై యువతి నిర్వాకం
శంషాబాద్, వెలుగు: తాను ప్రేమించిన యువకుడు రిజెక్ట్ చేయడంతో ఓ యువతి అతడిపై కోపం పెంచుకుంది. అతడిని ఎలాగైనా పెద్ద సమస్యలో ఇరికించాలని డిసైడ్ అయింది. ప్రియుడి పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేసి 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులకు పాల్పడింది. ఆ యువతిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన ప్రకారం.. చెన్నై కి చెందిన రెనే జోషిల్డా అనే యువతి చెన్నైలోని డెలాయిట్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తుంది.
కొలిగ్ దివేజ్ ప్రభాకర్ ను ప్రేమించింది. అతడు నిరాకరించడంతో కక్ష పెంచుకుంది. ఆయన పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేసి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య 12 రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెయిల్స్ పంపింది. ఆమె నుంచి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కూడా రెండుసార్లు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.