హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి చెరుకు సుధాకర్ రాజీనామా చేశారు. పార్టీలో ఉద్యమకారులు, బీసీ లీడర్లకు గుర్తింపు లేకుండా పోతున్నదని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి పంపించారు. ‘‘ఓవైపు ఓబీసీ కోటా, మహిళా రిజర్వేషన్లు, బీసీ కులగణన గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతుంటే.. మరోవైపు రాష్ట్ర పార్టీలో మాత్రం ఆధిపత్య కులాల కంపు మా లాంటి బీసీ లీడర్లకు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నది. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ స్థాయిని ప్రణాళిక ప్రకారం ఎట్లా తగ్గిస్తున్నరో.. అదే సమయంలో ఆర్థికంగా బలవంతుడైన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి లాంటి వాళ్లకు ప్రాధాన్యం ఎట్లా పెంచుతున్నరో అందరికీ తెలుసు” అని కామెంట్ చేశారు.
‘‘నా విషయంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విపరీత ప్రవర్తనను పార్టీ నాయకత్వం నిలువరించలేకపోయింది. నేను పనిచేస్తున్న నకిరేకల్ నియోజకవర్గంలో కనీసం నాకు సమాచారమైనా ఇవ్వకుండా వేముల వీరేశంను అభ్యర్థిగా ప్రకటించడం దేనికి సంకేతమో చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు. తన విషయంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని రేవంత్, ఉత్తమ్, జానారెడ్డి నిలువరించే ప్రయత్నమే చేయలేదన్నారు.