పెళ్లైన కాసేపటికే ఘోరం.. కారు ప్రమాదంలో వధూవరులు సహా ఐదుగురు మృతి

పెళ్లైన కాసేపటికే ఘోరం.. కారు ప్రమాదంలో వధూవరులు సహా ఐదుగురు మృతి

జాంజ్ గిర్: చత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో వధూవరులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఆదివారం జాంజ్ గిర్ చంపా జిల్లాలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..శుభమ్ సోని అనే యువకుడు బలోడా గ్రామంలో నివసిస్తున్నారు. అతడు శివనారాయణన్ పట్టణానికి చెందిన ఓ యువతిని శనివారం రాత్రి పెళ్లి చేసుకున్నారు.

వివాహం తర్వాత నూతన వధూవరులతో సహా ముగ్గురు కుటుంబ సభ్యులు కారులో బలోడాకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురితో సహా నలుగురు ఘటన స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన శుభమ్ సోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.