
- కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్న లక్ష్మీనర్సింహా చలం అలియాస్ సుధాకర్
- ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన శాంతిచర్చల్లో కీలక పాత్ర
- నంబాల ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
భద్రాచలం, వెలుగు: మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ తెంటు లక్ష్మీనర్సింహాచలం అలియాస్ సుధాకర్ (65) మృతి చెందారు. చత్తీస్గఢ్ రాష్ట్రం లోని బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్టైగర్ పార్కు ఏరియాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ, చత్తీస్గఢ్, మహారాష్ట్రలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత అయిన ఈయనపై కోటి రూపాయల రివార్డు ఉంది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన శాంతిచర్చల్లో ఈయన కీలకపాత్ర పోషించారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత సుధాకర్ మృతితో ఆ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఇంద్రావతి నేషనల్ టైగర్ పార్కు ఏరియాలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతో బస్తర్ ఐజీ సుందర్రాజ్పి, సీఆర్పీఎఫ్ఐజీ రాకేశ్అగర్వాల్, డీఐజీ కమలోచన్ కశ్యప్, నక్సల్స్ ఆపరేషన్స్ ఏడీజీ వివేకానందసిన్హా అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్, ఏఎస్పీ మయాంక్ గుర్జర్ఆధ్వర్యంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలను రంగంలోకి దించారు. నేషనల్ టైగర్ పార్కు ఏరియాను వీరు చుట్టుముట్టి కూంబింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో భద్రతా బలగాలు తిరిగి ఫైరింగ్స్టార్ట్చేశారని బస్తర్ఐజీ సుందర్రాజ్ పి తెలిపారు. అయితే, కాల్పులు జరుపుకుంటూ మావోయిస్టులు పారిపోయారని.. సంఘటనా స్థలంలో కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీనర్సింహాచలం అలియాస్ సుధాకర్ మృతదేహం కనిపించిందని చెప్పారు. ఆటోమేటిక్ గన్తో పాటు పేలుడు పదార్థాలు కూడా దొరికాయన్నారు. తెలంగాణకు చెందిన కీలక నేతలు బండి ప్రకాశ్, పాపారావు తదితరులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సమాచారం వచ్చిందని, పారిపోయిన నక్సల్స్ కోసం అదనపు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయని ఐజీ తెలిపారు.
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
ఇటీవల ఆరు నెలల కాలంలో మావోయిస్టు పార్టీకి తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ చీఫ్, జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మే నెల 21వ తేదీన అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. జయరాం అలియాస్ చలపతి, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు నీతి అలియాస్ నిర్మల, మహారాష్ట్రకు చెందిన రూపేశ్, ఒడిశాకు చెందిన దస్రూ, తెలంగాణకు చెందిన రణధీర్, జోగన్న వంటి సీనియర్ క్యాడర్ న్కౌంటర్లో చనిపోయారు.
2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని అంతం చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన నేపథ్యంలో భద్రతాబలగాలు అగ్రనేతలపై కన్నేశాయి. దండకారణ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మడివి హిడ్మాను టార్గెట్ చేసుకుని ప్రస్తుతం బలగాలు ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఆయుర్వేద విద్యను అభ్యసిస్తూ నక్సల్స్బాట
ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోని ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం సత్యవోలు సుధాకర్ స్వగ్రామం. ఇతని తండ్రి రామకృష్ణ నాయుడు. సుధాకర్ విజయవాడలో ఆయుర్వేదిక్ విద్యను అభ్యసిస్తూ నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్నక్సలైట్లలో చేరారు. వివిధ హోదాల్లో చురుగ్గా పాల్గొంటూ 2021లో కేంద్ర కమిటీ మెంబర్ స్థాయికి చేరారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మావోయిస్టులు నిర్వహించిన శాంతిచర్చల్లో అగ్రనేతలు రామకృష్ణ, గాజర్ల అశోక్తో కలిసి సుధాకర్ పాల్గొన్నారు. ఉద్యమంలో చేరిన నాటి నుంచి నేటి వరకు ఇంటి ముఖం చూడలేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇతని సోదరుడు ఆనందరావు సత్యవోలు గ్రామంలోనే వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయారు.