- యంగ్ ఇండియా స్కూల్కు శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.200 కోట్లతో నిర్మించనున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయనున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు. ఈ సభ వేదికగా జిల్లా అభివృద్ధికి సంబంధించి సీఎం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. సీఎం పర్యటన ఖరారు కావడంతో అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది.
ఈ నెల 9 వరకు సీఎం షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉండనుంది. 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, 7న రంగారెడ్డి జిల్లా పరిగిలో, 8న వరంగల్ జిల్లా భూపాలపల్లిలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. చివరగా ఈ నెల 9న మెదక్ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ప్రతిచోటా బహిరంగ సభలు, శంకుస్థాపనలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
