
ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 8వ మహాసభ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.తిరుపతయ్య, ఈ.నిరంజన్ అధ్యక్షతన జరిగింది.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో కలిసి బీర్ల ఐలయ్య జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వానికి పేరుతో పాటు ఆర్టీసీకి లాభాల బాటలో పయనిస్తోందన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు కల్పించేందుకు పాటుపడతానన్నారు. చిన్నచిన్న పొరపాట్లతో సస్పెండ్ కు గురైన ఉద్యోగులను తిరిగి తీసుకుంటామని, కారుణ్య నియామకాలు చేపట్టి రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు.
ఉద్యోగ భద్రతకు ఢోకా లేదు..
ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఉద్యోగుల సంక్షేమమే యాజమాన్యం కర్తవ్యమని, పెండింగ్లో ఉన్న డీఏ, ఏరియాస్ ఇస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ల తప్పు లేకుంటే వారి పక్షాన యాజమాన్యం నిలబడుతుందన్నారు. నిబంధనల ప్రకారం ప్రమోషన్లు కల్పిస్తామన్నారు. కాలుష్య నివారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2800 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పవన్ కుమార్ గౌడ్, గోపికృష్ణ, కె.రమేశ్, రేణుక, చారి, దుర్గయ్య, స్వరూప, కృష్ణ, భూషణ్, స్వామి, మంగమ్మ, శ్రీనివాస్ నేత, పద్మ, నగేశ్పటేల్, సీవీ రావు, సునీల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.