చిన్నారిపై అఘాయిత్యం: సీసీటీవీకి చిక్కిన నిందితుడు

చిన్నారిపై అఘాయిత్యం: సీసీటీవీకి చిక్కిన నిందితుడు
  • ఢిల్లీలో దారుణం.. సీసీటీవీకి చిక్కిన నిందితుడు 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆరేండ్ల బాలికకు మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లిన గుర్తుతెలియని యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  సీసీటీవీ ఫుటేజ్ లో బాలికతో పాటు కన్పించిన యువకుడే నిందితుడు అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలోని రంజిత్ నగర్ ఏరియాలో ఈ దారుణం జరిగింది. రోజువారీ కూలీ పనులు చేసుకునే ఓ వ్యక్తి కూతురు శుక్రవారం ఉదయం పొరుగునే ఉన్న ఓ లాంగర్ (కమ్యూనిటీ కిచెన్)లో ఫుడ్ తినేందుకని వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చిన చిన్నారికి బాగా బ్లీడింగ్ అవుతుండటంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో పాపపై రేప్ జరిగిందని డాక్టర్లు చెప్పారు. పాప తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఓ మార్కెట్ నుంచి బయటకు వచ్చిన యువకుడి వెంట పాప వెళ్తున్నట్లుగా కన్పించిందని తెలిపారు. అతడే నిందితుడు కావొచ్చని, అతను ఎవరన్నది ఇంకా తెలియలేదన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారికి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ జరుగుతోందని తెలిపారు. ఈ సంఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.