
- ఇప్పటి వరకు 28 మందిని అమ్మేసిన్రు
- ప్లాన్ వేసి.. మారువేషంలో వెళ్లి పట్టుకున్న పోలీసులు
- 13 మంది అరెస్ట్.. 10 మంది చిన్నారుల రెస్క్యూ
- అరెస్టయినవారిలో హైదరాబాద్, విజయవాడ, సూర్యాపేటవాసులు
- కేసును ఛేదించిన సూర్యాపేట రూరల్, సీసీఎస్ పోలీసులు
సూర్యాపేట, వెలుగు: శిశువులను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. వేరే రాష్ట్రాలనుంచి చిన్నారులను కొనుగోలు చేసి, ఇక్కడ విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలోని 13 మంది సభ్యులను అదుపులోకి తీసుకొని, 10 మంది చిన్నారులను రక్షించారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె. నరసింహ మీడియా సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు.
ముంబై, గుజరాత్ ప్రాంతాల నుంచి శిశువులను ఈ ముఠా అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటివరకూ వీళ్లు 28 మంది పిల్లలను అమ్మినట్టు తేలిందని చెప్పారు.
తీగలాగితే డొంక కదిలింది..
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నక్క యాదగిరి , ఉమారాణి దంపతులు కోడిగుడ్ల వ్యాపారం పేరిట గ్రామాల్లో తిరుగుతూ పిల్లలులేని దంపతులను గుర్తిస్తున్నారు. ముంబై , గుజరాత్ ప్రాంతాల నుంచి శిశువులను అక్కడి ముఠాల ద్వారా తీసుకొచ్చి, ఒక్కో శిశువుని రూ. 3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వారికి అమ్ముతున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన అంజయ్య, నాగయ్య పిల్లల కోసం యాదగిరిని సంప్రదించారు.
15 రోజుల మగ శిశువును విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. తమకొచ్చిన సమాచారం మేరకు అప్పటికే యాదగిరి మీద నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు శిశువును అప్పగించే సమయంలో వారిని అదుపులోకి తీసుకొని, శిశువును రెస్క్యూ చేశారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేపట్టగా శిశు విక్రయాల రాకెట్ వెలుగులోకి వచ్చింది.
స్కెచ్ వేసి పట్టుకున్న పోలీసులు..
విజయవాడకు చెందిన రామలక్ష్మి ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం లో పని చేస్తున్నది. కొంతమందితో ముఠాగా ఏర్పడింది. ఈ ముఠా సభ్యులు విజయవాడ, హైద్రాబాద్ లోని ఫెర్టిలిటీ సెంటర్లలో పిల్లల కోసం ప్రయత్నం చేసే దంపతులను గుర్తించేవారు. కమీషన్ల ఆశ చూపి వారి దగ్గరకు ఏజెంట్లను పంపేవారు. బయటి రాష్ట్రాల నుంచి శిశువులను తెప్పించి వారికి అమ్మేవారు. విచారణలో విషయం తెలసుకున్న పోలీసులు పిల్లలు కావాలంటూ రామలక్ష్మికి ఫోన్ చేశారు.
ఎంత ఖర్చయినా తమకు పిల్లలు కావాలని చెప్పడంతో ఆమె వారిని విజయవాడ రావాలని చెప్పింది. తల్లిదండ్రుల వేషంలో పోలీసులు అక్కడికివెళ్లగా.. హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన రాజు అనే వ్యక్తి వద్ద శిశువు అమ్మకానికి ఉన్నట్టు రామలక్ష్మి చెప్పింది. రాజుకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఆమెను, ఉప్పల్ కు వచ్చి రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారించారు. మిగతా ముఠా సభ్యుల వివరాలను సేకరించి, వారిని కూడా పట్టుకున్నారు. గుజరాత్, ముంబై, తదితర ప్రాంతాల నుంచి ఏడాది లోపు పిల్లలను అక్రమంగా తీసుకొచ్చి ఏపీ, తెలంగాణలో అమ్మినట్టు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.
ఒక్కో చిన్నారిని రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలకు విక్రయించినట్టు చెప్పారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే వారు పిల్లలను అమ్మారని, లీగల్ గా దత్తత తీసుకునే వ్యవహారం పట్ల అవగాహన లేక చాలామంది ఈ ముఠాను ఆశ్రయించినట్టు తెలుస్తున్నది. మొత్తం ఈ కేసులో హైదరాబాద్, విజయవాడ, సూర్యాపేటకు చెందిన 13 మందిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
కొనుగోలు చేసిన తల్లిదండ్రుల ఆందోళన
పిల్లలను కొనుక్కున్న తల్లిదండ్రులు.. చిన్నారులను తిరిగి అప్పగించాలంటూ సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు. తాము పెంచుకోవడానికే పిల్లలను తీసుకున్నామని, అవసరమైతే తమ ఆస్తిని మొత్తం రాసిస్తామని, పిల్లలను ఇవ్వకపోతే స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లలను ఎస్పీ ఆఫీస్ కు తరలిస్తుండగా పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు వారిని పక్కకు తొలగించి, అక్కడి నుంచి చిన్నారులను ఎస్పీ ఆఫీస్ కు తరలించారు. ఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తారన్న సమాచారంతో టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
నిందితులు వీరే...
అరెస్టయిన నిందితుల్లో 12 మంది ఏపీ, తెలంగాణకు చెందినవారు కాగా.. రాజస్థాన్వ్యక్తి ఉన్నారు. సూర్యాపేటకు చెందిన నక్కల యాదగిరి, ఉమారాణి, విజయవాడకు చెందిన కోరె నాగేంద్రకుమార్, కొట్టె రామలక్ష్మి, పిల్ల పావని, గరికముక్కు విజయలక్ష్మి, ఆముదాలపల్లి సత్యమణి, నాగర్కర్నూల్కు చెందిన ముడావత్ రాజు, హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఇస్తా శోభారాణి, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఖాన్షాహీనా, తిరుమలగిరి మార్కెట్కు చెందిన ఎండీ షాహానా, దిల్సుఖ్నగర్కు చెందిన సబావత్ శ్రీనివాస్, హైటెక్సిటీకి చెందిన ఏర్పుల సునీతను పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేశారు.