- నకిలీ పాస్పోర్ట్స్తో విదేశాలకు వెళ్లిన 92 మంది
- లుకౌట్ నోటీసులు జారీ
హైదరాబాద్, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లతో పాస్పోర్టులు పొందిన వారిపై రాష్ట్ర సీఐడీ ఫోకస్ పెట్టింది. ఫేక్ అడ్రస్ ప్రూఫ్స్తో పొందిన 92 పాస్పోర్టులను క్యాన్సిల్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాస్పోర్ట్ అథారిటీకి సీఐడీ చీఫ్ శిఖాగోయల్ లెటర్ రాశారు. ఫేక్ డాక్యుమెంట్లతో పొందిన 92 పాస్పోర్టుల నంబర్లు అందజేశారు. ఆ పాస్పోర్టులను రద్దు చేయాలని కోరారు. వీటితో ఇప్పటికే విదేశాలకు వెళ్లిన వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఫేక్ సర్టిఫికెట్స్తో విదేశీయులకు పాస్పోర్టులు ఇప్పిస్తున్న ముఠాను ఇటీవల సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అబ్దుస్ సత్తార్, ఇద్దరు ఎస్బీ కానిస్టేబుల్స్ సహా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కోరుట్ల, కరీంనగర్, జగిత్యాలలో సోదాలు చేసి 108 పాస్పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ ఆధార్, బర్త్ సర్టిఫికెట్స్, పాన్ కార్డులు సహా పాస్పోర్ట్కు అవసరమైన ఫేక్ డాక్యుమెంట్లతో 92 పాస్పోర్ట్లు జారీ అయినట్లు గుర్తించారు. వీటితో 92 మంది విదేశాలకు వెళ్లారని, పాస్ పోర్టులను రద్దు చేసి వారిని ఇండియాకు రప్పించాలని రీజనల్ పాస్పోర్ట్ అధికారులకు సీఐడీ లేఖ రాసింది. కాగా, ఈ కేసులో నిందితుల సంఖ్య 13కి చేరింది. త్వరలో మరికొంత మందిని అరెస్ట్ చేస్తామని అధికారులు తెలిపారు.