హైదరాబాద్, వెలుగు: ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రూపీని డాలర్గా మార్చి చైనాకు తరలించిన క్యాష్ లెక్కలు తీస్తున్నారు. 64 బ్యాంక్ అకౌంట్స్, రెండు ఫారిన్ ఎక్స్ఛేంజ్లకు సంబంధించిన డేటా సేకరిస్తున్నారు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.10 వేల కోట్లు కొట్టేసి, అందులో రూ.903 కోట్లు చైనాకు తరలించిన గ్యాంగ్ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు చైనా దేశస్తులు ఆపరేట్ చేస్తున్న మొబైల్ యాప్స్ నెట్వర్క్పై పోలీసులు ఫోకస్ పెట్టారు. చైనా యాప్స్ వెనుక పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరుగుతోందని భావిస్తున్న పోలీసులు.. షెల్ కంపెనీల వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ఈడీ, ఆర్బీఐ, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ)కు లెటర్ రాయనున్నారు.
అన్ని కేసులపై ఫోకస్..
ఈ కేసు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన సైబర్ ఫ్రాడ్ కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితుల వివరాల ఆధారంగా ఆయా యాప్లతో లింకైన బ్యాంక్ అకౌంట్స్ను ట్రేస్ చేస్తున్నారు. క్సిండై టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, బెటెంక్ నెట్వర్క్ ఫారిన్ ఎక్స్ఛేంజ్లకు వెళ్లిన క్యాష్ వివరాలను రాబడుతున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన ఫోన్ నంబర్ల డేటా సేకరిస్తున్నారు. వందల సంఖ్యలో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసినట్లు గుర్తించారు. నెట్ బ్యాంకింగ్ కోసం ఓటీపీలు షేర్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. లోన్ యాప్స్ నుంచి వసూలు అయ్యే డబ్బును ఇలాంటి అకౌంట్స్తో ఫారిన్ ఎక్స్ఛేంజ్లకు ట్రాన్స్ఫర్ చేసి.. అక్కడి నుంచి మనీ లాండరింగ్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా విదేశాలకు ట్రాన్స్ఫర్ అయిన డబ్బును రికవరీ చేసేందుకు అవకాశం లేదు.
రూ.లక్షకో అకౌంట్..
ఈ కేసులో దుబాయ్లోని ఇమ్రాన్ అనే వ్యక్తి చెప్పిన విధంగా హైదరాబాద్కు చెందిన సయ్యద్ సుల్తాన్, మీర్జా నదీం బేగ్, మహమ్మద్ ఫర్వేజ్ కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇచ్చారు. దీంతో పాటు సిమ్ కార్డులను అందించారు. ఇలా ఫేక్ అకౌంట్ల కోసం చైనీయులు ఒక్కో అకౌంట్ కు రూ.లక్ష చెల్లించగా.. అందులో ఒక్కో అకౌంట్కు రూ.30 వేలు ఇమ్రాన్ కమీషన్ తీసుకున్నాడు. అయితే తాము ఓపెన్ చేసిచ్చిన అకౌంట్లలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో కూడా బాధితులు గుర్తించలేదు. పోలీసులు అరెస్ట్ చేసేంత వరకు కూడా వాళ్లకు ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ గురించి తెలియలేదు. దీంతో ఇమ్రాన్ ఇంకెన్ని అకౌంట్లు ఓపెన్ చేయించాడనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నిందితులను కస్టడీకి తీసుకుని విచారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
