రివ్యూలు కాదు.. రిజల్ట్స్ కావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 2026 సెప్టెంబర్ 10వ తేదీన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించిన సీఎం.. అధికారులకు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. శాఖలు, అంశాలపై గంటల తరబడి రివ్యూలు చేయడం కాదు... రిజల్ట్స్ కావాలని అధికారులకు సూచించారు. 27 నెలల్లో 28 కొత్త పాలసీలతో అవకాశాలను అన్ లాక్ చేశామని అన్నారు. ఫైల్ పెండింగ్ అంటే అభివృద్ధి పెండింగేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సాధారణ పరిపాలన కాదు.. ప్రజలు మెచ్చే సుపరిపాలన కావాలని అన్నారు వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్... అదే స్వర్ణాంధ్ర అని ఈ సందర్భంగా అధికారులతో అన్నారు సీఎం చంద్రబాబు. కరువు ప్రాంతాలకు నీళ్లిస్తేనే తనకు సంతృప్తి అని.. రియాక్టివ్ నుంచి ప్రో యాక్టివ్ దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు.
జిల్లాకు 25, నియోజకవర్గానికి 10-15 ప్రాధాన్యతాంశాలను గుర్తించి పరిష్కారం దిశగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. మభ్యపెట్టే విధంగా కాకుండా వాస్తవ నివేదికలు కావాలని అన్నారు. కలెక్టర్లు, అధికారులు, మంత్రుల మధ్య పోటీ ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. సాగునీటి రంగంలో విశేష కృషి చేసి వాటర్ మ్యాన్గా నిలిచిన సీఎం చంద్రబాబుకు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో స్టాండింగ్ ఓవేషన్ లభించింది.
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా 27 నెలల్లో రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను గాడిన పెట్టామని అన్నారు సీఎం. రూ.1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ.1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశామని చెప్పారు. రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్ -1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తిచేశామని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి గుంటూరు, విజయవాడకు రాజధానిని కనెక్ట్ చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు.
