అధికారులతో  సీఎం జగన్ సమావేశం.. కీలక ఆదేశాలు జారీ

అధికారులతో  సీఎం జగన్ సమావేశం.. కీలక ఆదేశాలు జారీ

విశాఖపట్టణంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితులపై సీఎం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, రంగాలకు విశాఖ హబ్‌ కావాలని సీఎం అన్నారు. దీనికోసం ప్రత్యేక శద్ధ తీసుకోవాలని, దీనివల్ల విశాఖనగరం ఖ్యాతి పెరుగుతుందని, ఐటీకి చిరునామాగా మారుతుందని చెప్పారు. ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లలో వృద్ధిని అధికారులు సీఎంకి వివరించారు. స్థిరధరల సూచీ ప్రకారం.. 2019లో రాష్ట్రం ఏపీ జీడీపీ వృద్ధి 5.36శాతం అని, ఇది దేశ సగటు 6.5శాతం కన్నా తక్కువ అని తెలిపారు. గడచిన నాలుగేళ్లలో మంచి ప్రగతి ఉందన్నారు. 2021-22లో రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్‌ రేట్‌ 11.43శాతానికి పెరిగిందని.. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా నంబర్‌ ఒన్‌ స్థానంలో నిలుస్తున్నామని సీఎంకి అధికారులు వెల్లడించారు. 2022-23లో జీడీఎస్‌డీపీలో గ్రోత్‌ రేట్‌ 16.22 శాతంగా ఉందని పేర్కొన్నారు. జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని చెప్పారు. 2022 జనవరి – డిసెంబరు మధ్యకాలంలో రూ.45,217 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయన్నారు. 2021-22లో ఎగుమతుల విలువ 1.43 లక్షల కోట్లు కాగా.. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అది రూ. రూ.1.6లక్షల కోట్లు పెరిగిందని చెప్పుకొచ్చారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సార్లు ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహించి, 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామన్నారు. వీటి ద్వారా రూ. 3,39,959 కోట్ల పెట్టుబడులు, 2,34,378 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. 2016 నుంచి 2018 వరకూ గత ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుల ద్వారా 1739 ఎంఓయూలను కుదుర్చుకుంటే రూ. 18,87,058 పెట్టుబడులు వస్తాయని చెప్పారని.. కానీ ఇందులో 10శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదని తెలిపారు. విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ ద్వారా 387 ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు.. ఇందులో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదిరాయని, ఇందులో 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయని, రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలుపెట్టనున్నాయన్నారు. జనవరి 2024లోపు 38 కంపెనీలకు పనులు ప్రారంభమవుతాయని, మార్చి 2024లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయనని వెల్లడించారు. దీంతో.. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీ ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని సీఎం ఆదేశించారు.