లతాజీ మరణంతో పాట మూగ బోయింది

లతాజీ మరణంతో పాట మూగ బోయింది

లెజెండరీ సింగర్, భారతరత్న లతా మంగేష్కర్  మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన పాట తో భారతీయ సినీ సంగీత రంగం పై చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. దేశానికి లతా మంగేష్కర్ ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని సీఎం పేర్కొన్నారు. లతా మంగేష్కర్ మరణంతో  పాట మూగ బోయినట్లైందని, సంగీత మహల్ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.

20 భాషల్లో  1000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతా మంగేష్కర్ సరస్వతీ స్వర నిధి. వెండితెర మీద నటి హావభావాలకు అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్టు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని అన్నారు కేసీఆర్. సినీ నిర్మాతలు మొదట హీరో హీరోయిన్ల ను ఖరారు చేసుకుని సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు. కానీ సింగర్ గా లతా మంగేష్కర్  సమయం ఇచ్చిన తర్వాతనే సినిమా షూటింగ్ ప్రారంభించే వారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. పాటంటే లతా జీ .. లతా జీ అంటే పాటగా మారిపోయిందన్నారు. సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వం లో వోలలాడించిన లతా మంగేష్కర్, ఉత్తర దక్షిణాది కి సంగీత సరిగమల వారధి. ఎందరో గాయకులు రావచ్చు కానీ లతా జీ లేని లోటు పూరించలేనిదని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతి  తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన మెగాస్టార్

దైవం ముందు ప్రజలు, భక్తులు అందరూ ఒక్కటే