లాక్‌‌డౌన్‌‌ పెట్టం..ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతది

లాక్‌‌డౌన్‌‌ పెట్టం..ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతది

రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు, ఆక్సిజన్‌‌, రెమ్డెసివిర్‌‌ సరఫరా గురించి ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్​ ఫోన్‌‌లో మాట్లాడారు. తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాలని కోరారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు, కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ అందట్లేదని చెప్పారు. రాష్ట్ర జనాభాకు అదనంగా 50 శాతం మంది పేషెంట్లు సరిహద్దు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌‌కు ట్రీట్‌‌మెంట్‌‌కు వస్తున్నారని చెప్పారు. దీంతో భారం పెరిగిపోయిందన్నారు. ప్రస్తుతం రోజుకు 440 టన్నుల ఆక్సిజనే అందుతోందని, 500 టన్నులకు పెంచాలని కోరారు. రోజుకు 4,900 రెమ్డెసివర్‌‌ వయల్స్‌‌ అందుతున్నాయని..25,000లకు పెంచాలని కోరారు. ఇప్పటివరకు 50 లక్షల వ్యాక్సిన్‌‌ డోసులను అందించారని, కానీ రాష్ట్రంలో రోజుకు 2 నుంచి 2.5 లక్షల డోసులు అవసరమవుతున్నాయని, వాటిని వెంటనే సరఫరా చేయాలని విజ్జప్తి చేశారు. ప్రధాని ఆదేశాల మేరకు కేసీఆర్‌‌తో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడారు. సత్వర సాయానికి చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పు రాష్ట్రాలనుంచి ఆక్సిజన్‌‌ సరఫరా జరిగేలా చూస్తామని చెప్పారు.


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లాక్‌‌డౌన్ పెట్టబోమని సీఎం కేసీఆర్‌‌ మరోసారి స్పష్టం చేశారు. లాక్‌‌డౌన్‌‌ పెడితే ప్రజా జీవనం స్తంభించిపోతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదముందని అన్నారు. వేరే రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టినా కేసులు తగ్గట్టేదని, గత అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రధాని మోడీతో ఫోన్‌‌లో మాట్లాడి రాష్ర్టానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమ్డిసివిర్‌‌ తక్షణమే సమకూర్చాలని కోరారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం ప్రగతిభవన్‌‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రానికి ప్రస్తుతం ఎంత ఆక్సిజన్ అందుతోంది? ఇంకా ఎంత కావాలి? వాక్సిన్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయి? రోజుకు ఎంత అవసరం? రెమ్డిసివిర్‌‌ ఏ మేరకు సప్లై జరుగుతోంది? రాష్ట్ర అవసరాలకు రోజుకు ఎన్ని అవసరం? ఆక్సిజన్‌‌ బెడ్లు ఎన్ని ఉన్నాయి’ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో సీఎం చర్చించారు. లాక్‌‌డౌన్ వల్ల ఉపయోగం లేదని సీఎం అన్నారు. పరిశ్రమలు ఉన్నఫలంగా మూతపడితే అంతా ఆగమాగం అవుతుందని, ఆకలి సంక్షోభం వచ్చే ప్రమాదముందని చెప్పారు. గొంతు పిస్కినట్టు చేస్తే మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోయే ప్రమాదముందన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మైక్రో లెవల్ కంటెయిన్‌‌మెంట్‌‌ జోన్లను ప్రకటించి కరోనా నిరోధక చర్యలను చేపడతామన్నారు. 
రాష్ట్రంలో 6 వేల కరోనా ఔట్‌‌ పేషెంట్‌‌ సెంటర్లు
రాష్ట్రంలో ఇప్పటివరకు 9,500 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని, హైదరాబాద్ సహా జిల్లాల్లో కలిపి మరో వారంలో 5 వేలు పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. మెరుగైన ఆక్సిజన్ సరఫరా కోసం రూ. కోటి చొప్పున 12 క్రయోజనిక్ ట్యంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సీఎస్‌‌ను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ, ఏరియా హాస్పిటళ్లలో కలిపి 5,980 కరోనా ఔట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని, వీటిని ప్రజలు వాడుకోవాలని కోరారు. రెమ్డిసివిర్‌‌ తయారీ సంస్థలతో ఫోన్‌‌లో మాట్లాడిన సీఎం.. వాటి లభ్యతను మరింత పెంచాలని కోరారు. రోజువారీ కరోనా పరిస్థితిపై రోజూ సాయంత్రం మీడియా వివరాలను వెల్లడించాలని హెల్త్‌‌ అధికారులను సీఎం ఆదేశించారు. దీనికి  డైరెక్టర్ ఆఫ్ హెల్త్ బాధ్యత తీసుకోవాలన్నారు. కరోనా నియంత్రణకు హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని చెప్పారు. హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. మొదటి డోస్ వాక్సిన్ వేసుకున్న వారికి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.  
ఇంటింటికీ కిట్లు
ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌‌తో ఫోన్‌‌లో మాట్లాడిన సీఎం.. తక్షణమే ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆరాతీశారు.  500 ఆక్సిజన్ ఎన్‌‌రిచర్లను కొనాలని వైద్యాధికారులను ఆదేశించారు. త్వరలో మరిన్ని సమకూర్చాలని, తక్కువ టైమ్‌‌లో ఆక్సిజన్ ఉత్పత్తిని జరిపే వ్యవస్థలను నెలకొల్పేందుక చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో సోడియం హైపో క్లోరైడ్‌‌ను పిచికారీ చేయించాలని ఆదేశించారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావొద్దని కేసీఆర్ కోరారు. అనుమానం వస్తే టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కరోనా మెడికల్ కిట్లను వాడుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఎఎన్ఎంల ద్వారా ఇంటింటికీ కిట్లు అందజేస్తామన్నారు.