
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తొలుత పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పార్టీ ఆఫీసు ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఆఫీసును ప్రారంభించిన అనంతరం కేసీఆర్ కార్యాలయం అంతటా కలియదిరిగారు. ఆ తర్వాత తనకు కేటాయించిన ఛాంబర్లో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత.. కార్యక్రమానికి హాజరైన నాయకులతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ముహుర్తం మేరకు టైం చూసుకుని బీఆర్ఎస్ అధినేతగా తొలి సంతకం చేశారు.
అంతకు ముందు ఢిల్లీలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ జేడీఎస్ నేత కుమారస్వామి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్లతో కలిసి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. పార్టీ ఆఫీస్ ఆవరణలో నిర్వహించిన రాజశ్యామల యాగంలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. అఖిలేష్ యాదవ్, కుమారస్వామి సైతం యాగశాలను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. రైతు సంఘం నేతలు సైతం యాగానికి హాజరయ్యారు. ఉదయం సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు వచ్చారు. అక్కడ యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు.