టీఆర్ఎస్ సహా కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరు రక్షించలేరు

టీఆర్ఎస్ సహా కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరు రక్షించలేరు

సీఎం కేసీఆర్ తెలంగాణ డబ్బులు తెచ్చి ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో 15 శాఖలు ఉన్నాయని.. ఆ కుటుంబం మారితేనే తెలంగాణ బాగుడుతుందని చెప్పారు. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ప్రగతిభవన్ లోనే ఉన్నాయన్న ఆయన రాష్ట్రాన్ని కేసీఆర్ నవ్వుల పాలు చేస్తుండని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ను ఎవరు సీరియస్గా తీసుకోవడం లేదని.. ఆయన మాట్లాడుతుంటే లేచి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ సహా కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరు రక్షించలేరని వ్యాఖ్యానించారు. 

మునుగోడు ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్ధమే

ఇతర రాష్ట్రాలతో పాటు మునుగోడు ఉపఎన్నిక ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్ధమేనన్నారు. హామీల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న కేసీఆర్ 8 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టారని నిలదీశారు. హిందూ దేవుళ్లను కించపరిచిన మునావర్ షో లను అనేక రాష్ట్రాలు నిషేధిస్తే.. కేసీఆర్ సర్కార్ మాత్రం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం సిగ్గుచేటన్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందాం అంటే సీఎం అందుబాటులో ఉండరని విమర్శించారు.

నీతివంతమైన పాలన..అవినీతి పాలన అయ్యిందా..

మోడీ ది నీతివంతమైన పాలన అని సీఎం కేసీఆర్ గజ్వేల్లో పొగిడారని.. అయితే హూజూరాబాద్ లో గెలవగానే అది అవినీతి పాలన అయ్యిందని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి వాళ్లకు బీజేపీ భయపడదని..మోడీ పాలనలో దేశంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు. తమ సమస్యలు తీర్చే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ వారే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.