
- స్థానిక ఎన్నికల్లో గెలవాలి
- ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: సీఎం రేవంత్
- బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ పెట్టండి
- మన పాలన గోల్డెన్ పీరియడ్.. కష్టపడితే మళ్లీ అధికారం మనదే
- 2029లో జమిలి ఎన్నికలు రావొచ్చు
- డీలిమిటేషన్తో అసెంబ్లీ సీట్లు పెరుగుతయ్
- పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని నేతలకు సూచన
హైదరాబాద్, వెలుగు: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘లోకల్బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ మరింత బలోపేతమవుతుంది. ఇందుకోసం ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. గ్రామాల్లోకి వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా పల్లెలకు వెళ్లండి. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయండి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ మనం గెలిచి తీరాలి. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలన, మన 18 నెలల పాలనపై ప్రజల్లో చర్చ పెట్టండి. మనం చేసిన పనులను లెక్కలతో సహా ప్రజలకు వివరించండి” అని పిలుపునిచ్చారు. 18 నెలల కాంగ్రెస్ పాలన గోల్డెన్ పీరియడ్ అని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పాలనలో ఇదే ఊపు కొనసాగిస్తే రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మంగళవారం గాంధీభవన్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ), అడ్వైజరీ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా పీసీసీ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా నియమితులైన నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. అనంతరం పార్టీ నేతలను ఉద్దేశించి, అంతకుముందు పీఏసీ మీటింగ్లోనూ ఆయన మాట్లాడారు.
ఆడబిడ్డలకు మస్తు అవకాశాలు..
రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరుగుతాయని, మహిళా రిజర్వేషన్లతో ఆడబిడ్డలకు రాజకీయ అవకాశాలు మరింత పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, 2029లోనే మళ్లీ ఎన్నికలు రావొచ్చని చెప్పారు. పార్టీ పదవులను నిర్లక్ష్యం చేయకుండా, ప్రజలకు సేవ చేస్తే 2029లో ఏర్పడే ప్రభుత్వంలో ఎన్నో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ‘‘పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి ప్రభుత్వంలో తగిన భాగస్వామ్యం ఉంటుంది. పార్టీ పదవులను చిన్నచూపు చూడకుండా, వాటిని సద్వినియోగం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.
పార్టీ బాధ్యతలు మోసిన వారికి కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం కల్పిస్తాం” అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మ లను ఉదాహరణను చెబుతూ.. ‘‘సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా నిర్మల అద్భుతంగా పని చేశారు. ఆమె కష్టానికి గుర్తింపుగానే టీజీఐఐసీ చైర్ పర్సన్ పదవి లభించింది. జగ్గారెడ్డి సైగతో ఆవిడకు ఆ పదవి రాలేదు. ఇలాగే మీరందరూ కూడా కష్టపడితే ఉన్నత అవకాశాలు లభిస్తాయి” అని పేర్కొన్నారు.
పార్టీ నిర్మాణంలో భాగమవ్వండి..
వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలుగా నియమితులైన నేతలు పార్టీ నిర్మాణంలో భాగస్వాములై, అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అయిపోయామని.. ఇక మీ రాజకీయ జీవితం నల్లేరు మీద నడకేనని మీరు అనుకుంటే పొరపాటు. మీరు ఆ పదవుల్లో ఉండేది మూడేండ్లే. ప్రభుత్వం ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంటుంది. 2029లో ఎన్నికలు వస్తాయి కాబట్టి.. ఇంకా నాలుగేండ్లు ప్రభుత్వం ఉంటుంది.
పని చేయని వాళ్లను ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడు తప్పకుండా తప్పిస్తారని నేను విశ్వసిస్తున్నాను. అందుకే గ్రామ, మండల, జిల్లా కమిటీల నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించి.. సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ముందుండండి” అని సూచించారు. ఈ సందర్భంగా 18 నెలల కాలంలో జరిగిన ప్రగతిని వివరించారు. మొదటి ఏడాలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. సమావేశాల్లో ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, సీతక్క, సీనియర్ నేత కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో ముందుకెళ్లాలి..
పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా కలిసి పని చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ నాయకులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. కష్టపడి పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వారికే పదవులు ఇచ్చామని చెప్పారు. ‘‘కష్టపడి పనిచేస్తే గుర్తింపు దక్కుతుంది. నాకు 2018లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, 2019లో ఎంపీగా, ఆ తర్వాత పీసీసీ చీఫ్గా , అనంతరం సీఎంగా అవకాశం వచ్చింది.
కాంగ్రెస్లో కార్యకర్త స్థాయి నుంచి అనేక మంది పీసీసీ చీఫ్లుగా, మంత్రులుగా, సీఎంలుగా ఎదిగారు. పీసీసీలో పార్టీ బాధ్యతలు మోసిన 65 మందికి ప్రభుత్వంలో పదవులు దక్కాయి” అని తెలిపారు. ‘‘పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేస్తే మళ్లీ రెండోసారి అధికారంలోకి వస్తాం. పదేండ్ల పాటు రాష్ట్రంలో పార్టీని నడిపించే బాధ్యతను నేను తీసుకుంటాను. ఆ తర్వాత నాయకులను తయారు చేసే బాధ్యతను మీరు తీసుకోవాలి” అని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలి: మీనాక్షి
లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా నేతలంతా సమన్వయంతో పని చేయాలని ఆ పార్టీ స్టేట్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపు నిచ్చారు. పాత, కొత్త నేతలను కలుపుకొని పని చేయాలని.. పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదన్నారు. త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని, దీనికోసం ఇప్పటి నుంచే వ్యూహ రచన చేయాలని సూచించారు. పార్టీ విజయం కోసం గ్రేటర్ పరిధిలోని నాయకులంతా కష్టపడాలన్నారు.
వాళ్లందరినీ సమన్వయం చేయాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నంకు సూచించారు. పీసీసీ పీఏసీ, అడ్వయిజరీ కమిటీ సమావేశాల్లో మీనాక్షి మాట్లాడారు. ‘‘పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు దక్కుతాయి. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు వాటంతటవే వస్తాయి. ఇందులో ఎవరి సిఫారసులు అవసరం లేదు. ఎవరెవరు ఎలా పని చేస్తున్నారో మాకు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతాయి” అని పేర్కొన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఇక నుంచి క్షేత్ర స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తానని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
తెలంగాణలో గోల్డెన్ పాలన: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
తెలంగాణలో గోల్డెన్ పాలన సాగుతున్నదని, దేశం మొత్తం రాష్ట్రం వైపే చూస్తున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పీసీసీ పీఏసీ, అడ్వయిజరీ కమిటీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఆదర్శ పాలన అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కులగణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టాం. తెలంగాణలో జరుగుతున్న పాలన విషయంలో రాహుల్ గాంధీ చాలా సంతృప్తిగా ఉన్నారు.
ఆయన ఎక్కడ మాట్లాడినా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తున్నారు” అని పేర్కొన్నారు. ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ వంటి సంస్థాగత కార్యక్రమాలు రాష్ట్రంలో చాలా బాగా అమలవుతున్నాయని ఏఐసీసీ మెచ్చుకున్నదని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. రైతు భరోసా మంచి పథకమని, గతంలో ఎన్నడూ లేని విధంగా 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు.ఈ విజయాలన్నీ కార్యకర్తలు, నాయకుల కృషి వల్లనే సాధ్యమయ్యాయని చెప్పారు.