- కల్వకుంట్ల కిషన్రావుగా మారి ఆయనను కాపాడుతున్నడు
- కేటీఆర్, హరీశ్కు కూడా రక్షణ కల్పిస్తున్నడు: సీఎం రేవంత్ రెడ్డి
నిజామాబాద్, వెలుగు: రూ.లక్ష కోట్లు మింగిన కేసీఆర్ జైలుకు వెళ్లకుండా ఆయన దత్తపుత్రుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి కాపాడుతున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కిషన్రావుగా మారి కేసీఆర్కు ఊడిగం చేస్తున్న కిషన్రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తేవాలని బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్రావుకు సూచించారు. శుక్రవారం నిజామాబాద్ శివారులోని బర్దిపూర్లో నిర్వహించిన ‘ప్రజాపాలన-–ప్రగతి బాట’ సభలో సీఎం ప్రసంగించారు. ‘‘గతంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధాని మోదీ, అమిత్షా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంలా మారిందని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దిగమింగిన కేసీఆర్, హరీశ్రావు కేసును కేంద్రానికి ఇస్తే 48 గంటల్లో జైల్లో పెట్టిస్తమని కిషన్రెడ్డి అన్నరు. దీంతో అసెంబ్లీలో చర్చ పెట్టి ఆరు నెలల క్రితం కేసును సీబీఐకి రిఫర్ చేసినం.. మరిప్పుడేమైంది? జైళ్లో పెడ్తామన్న కిషన్రెడ్డి యాడబోయి , ఏ బొక్కలో దాక్కున్నడు? లక్ష కోట్లు తిన్న కేసీఆర్, హరీశ్రావును చర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు తినకుండా ఆపుతున్నదెవరు? కేటీఆర్ను జైల్లో పెట్టుమని ఎంపీ అర్వింద్ అడుగుతున్నడు. అందుకే ఫార్ములా–ఈ -కేసును మోదీ దగ్గరకు పంపితే అక్కడి ఆఫీసులో మూలనపడ్డది’’ అని రేవంత్రెడ్డి ఫైర్అయ్యారు.
‘‘కేసీఆర్, హరీశ్రావును కిషన్రెడ్డి ఏ రకంగా కాపాడుతున్నడో, కేటీఆర్కు ఎలా రక్షణగా ఉంటున్నడో ఎంపీ అర్వింద్కు అర్థమైతలేదా? ఆయనకు బాధ్యత లేదా? మోదీ దగ్గరకు పోయి లక్ష కోట్లు తిన్న దోషుల కేసులను ఎందుకు ముందుకు తీసుకెళ్లట్లేదో ప్రశ్నించాలి. మోదీ దగ్గర పరపతి ఉందని చెప్పుకునే ఎంపీ అర్వింద్.. దాన్ని నిరూపించుకోవాల్సిన టైమ్ వచ్చింది. వారిని ఎప్పుడు అరెస్ట్చేస్తారో మొదట చెప్పి మున్సిపల్ఎన్నికల్లో ఓట్లడగాలి. బీజేపీ, బీఆర్ఎస్పార్టీలది విడదీయలేని ఫెవికాల్ బంధం. అందుకే అరెస్టులు చేయరు. మున్సిపల్ ఎన్నికలో బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టే... మూసీ నదిలో మురిగిపోయినట్లే. అందుకే ఓటుతో బీజేపీని బొందపెట్టాలి’’ అని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు.
మోరీల క్లీనింగ్కు మోదీని కలవాలా?
కేంద్రం నుంచి నిధులు తేవడం చేతగాని బీజేపీ ఎంపీలు మున్సిపల్ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీకు ఓటేస్తే ఇక్కడి గల్లీల్లో మోరీలు క్లీనింగ్ చేయడానికి మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఢిల్లీకి వెళ్లి మోదీని కలవాలా? అని నిలదీశారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతి, మోసాలకు పాల్పడింది. ఏండేండ్ల నుంచి ఎంపీగా పనిచేస్తున్న అర్వింద్ నిజామాబాద్కు ఒరగబెట్టిందేమీ లేదు. మున్సిపల్ వ్యవహారాలు స్థానిక ఎమ్మెల్యే, స్టేట్మున్సిపల్ మినిస్టర్ పరిధిలోని అంశాలు. మున్సిపల్ శాఖను నేనే చూస్తున్న. జిల్లా కాంగ్రెస్ లీడర్లు డైరెక్ట్గా నన్ను కలుస్తరు. దండిగా ఫండ్స్ ఇవ్వడానికి వీలైతది. గత రెండేండ్లలో స్టేట్లోని మున్సిపాలిటీలకు రూ.17,455 కోట్ల ఫండ్స్ఇచ్చినం. కాంగ్రెస్పార్టీకి పేరొస్తదని బీఆర్ఎస్ మేయర్లు, చైర్మన్లు వాటిని ఖర్చు చేయలే. ఇప్పుడా పరిస్థితి రావొద్దు. బీజేపీకి ఓటేసి కాంగ్రెస్ను అభివృద్ధి అడిగితే గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండినట్లయితది. వెనుకట మట్టికి పోయినా ఇంటోడు పోవాలని పెద్దోళ్లు అనేవారు. అలాగే లోకల్గా కార్పొరేటర్, కౌన్సిలర్మనోడు ఉంటే బస్తీలు, కాలనీలు బాగుపడతయ్’’ అని సీఎం అన్నారు.
ఔను.. నేను రేవంతుద్దీన్..
కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పునాదులపై నిర్మితమైందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘దేశంలో ఒక ముస్లింను రాష్ట్రపతి చేసింది కాంగ్రెస్. 8 మంది ముస్లింలను సీఎంలుగా చేసిన చరిత్ర కాంగ్రెస్ది. అందుకే నా కేబినెట్లో కూడా అజారుద్దీన్ను తీసుకున్న. రేపో మాపో ఆయన్ను ఎమ్మెల్సీగా చేయబోతున్నం. 4 శాతం ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ పరిరక్షణకు నేను కట్టుబడి ఉన్నా. దానిని వక్రీకరిస్తూ బీజేపీ స్టేట్ప్రెసిడెంట్ రాంచందర్రావు నన్ను రేవంతుద్దీన్అని అన్నరు. ఆయన కామెంట్కు నేనేమీ బాధపడడం లేదు. వందేండ్ల తరువాత బీసీ కులగణన చేసినప్పుడు పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ నన్ను రేవంత్ గౌడ్ అన్నరు. ఎస్సీ వర్గీకరణతో మాదిగ జాతి దాని ఉపకులాలకు మేలు చేసినప్పుడు నేను రేవంత్ మాదిగ అయిన. 35 ఏండ్ల యువకుడు అనిల్యాదవ్ను రాజ్యసభకు పంపితే రేవంత్ యాదవ్ అన్నరు. వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు రేవంత్ ముదిరాజ్, మూసీ నది పరివాహక ప్రాంతంలో సిక్కులకు స్వర్ణదేవాలయం లాంటి ఆలయం నిర్మిస్తానన్నప్పుడు సర్దార్రేవంత్ సింగ్ అయ్యాను. ఇప్పుడు 4 శాతం ముస్లిం రిజర్వేషన్ కోసం రేవంతుద్దీన్ కావడాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నా. అన్ని కులమతాలను సమన్వయం చేసుకొ ని ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలో నంబర్1గా నడిపే గొప్ప అవకాశాన్ని నాలుగు కోట్ల మంది నాకివ్వడం గర్వంగా భావిస్తాను’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఎంపీ అర్వింద్ నిజామాబాద్ను స్మార్ట్ సిటీ చేయలే.. ఎయిర్పోర్ట్ తేలే. ఫండ్స్ తేవడంలో ఫెయిల్అయ్యిండు. అందుకే ఇక జిల్లా అభివృద్ధికి నేను పూర్తిగా సహకరిస్తా. ఎయిర్పోర్ట్ తెస్తా. ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా. మంచిప్ప ప్రాజెక్టు పూర్తి చేస్తా. వాళ్లో వీళ్లో వచ్చి ప్రలోభపెడితే లొంగకుండా కాంగ్రెస్కు ఓటేయండి’’ అని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్.. పెన్ను పేపర్ పట్టి రాసుకో
రెండేండ్ల పాలనలో యువతకు 70 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘‘ఫామ్హౌస్లో ఖాళీగా ఉన్న కేసీఆర్.. పెన్ను పేపర్ తీసుకొని నోట్చేసుకో. ఎల్బీ స్టేడియం వస్తే జాబ్స్ఇచ్చిన వారి తలలు లెక్కబెట్టి చూపుతా. ఒక్క తల తక్కువైనా నా తల తీసుకుంటా. పదేండ్లు గ్రూప్1 పరీక్షలు పెట్టలేదు. మేం నిర్వహిస్తే కాళ్లలో కట్టెలు పెట్టి కోర్టు లిటిగేషన్లుపెట్టిన్రు. నిన్న హైకోర్టు బీఆర్ఎస్కు చెంపచెళ్లుమనిపించింది. 562 మందికి గ్రూప్-1 అపాయింట్మెంట్ఆర్డర్లిచ్చినం. కేసీఆర్ఇచ్చిన దొడ్డుబియ్యాన్ని బర్లకు వేసేవారు. లేదంటే రేషన్ డీలర్లకే అమ్మేసేటోళ్లు. మేం వచ్చాక 3.17 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నం. అక్కలందరూ కడుపునిండ తిని పిల్లలకు వండిపెడ్తున్నరు. పంట రుణమాఫీ, బోనస్తో వరి దిగుబడులు పెంచినం. స్టేట్లో అత్యధిక బోనస్ లబ్ధి పొందిన జిల్లా నిజామాబాదే. బీఆర్ఎస్వేసిన చిక్కుముళ్లను ఒక్కోటి తీసుకుంటూ ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ను నిండుమనస్సుతో ఆశీర్వదించాలి’’ అని సీఎం కోరారు. అనంతరం రూ.200 కోట్ల విలువ లోన్లను స్వయం సహాయ సంఘాలకు రిలీజ్ చేశారు. అంతకుముందు బర్దీపూర్లో హెలికాఫ్టర్ దిగిన సీఎం రేవంత్రెడ్డి.. సమీపంలోని మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ సమాధిని సందర్శించి నివాళి అర్పించారు. తరువాత నిజామామాద్ నగర పాలక సంస్థ పరిధిలో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులను పరిచయం చేసుకొని కొంత సమయం వారితో చిట్చాట్ చేశారు.
మాది లక్కీ జోడీ..
మహేశ్ గౌడ్ది, తనది లక్కీ జోడీ అని సీఎం రేవంత్ అన్నారు. ‘‘2023లో నేను పీసీసీ చీఫ్గా, మహేశ్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా స్టేట్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చాం. మళ్లీ 2029లో మహేశ్ గౌడ్ పీసీసీ చీఫ్గా, సీఎంగా నేను రెండోసారి అధికారంలోకి తీసుకువస్తం. ఆనాడు వైఎస్సార్ సీఎంగా, డి.శ్రీనివాస్ పీసీసీ చీఫ్గా రెండోసారి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను అధికారంలోకి ఏ విధంగా తీసుకువచ్చారో.. మళ్లీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను నేను, మహేశ్ గౌడ్ తీసుకుంటాం” అని చెప్పారు.
గాజుల సౌమ్య, ప్రమోద్ కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం
గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి మృతి చెందిన ఆబ్కారి కానిస్టేబుల్ గాజుల సౌమ్య, రౌడీ షీటర్ దాడిలో గత ఏడాది ఆగస్ట్ నెల హత్యకు గురైన ప్రమోద్ కుమార్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి చొప్పున నష్టపరిహారం అందజేశారు. ఈ మేరకు చెక్కులను వారి కుటుంబీకులకు శుక్రవారం ప్రజాపాలన-ప్రగతిబాట సభలో అందజేశారు.
8 మంది ఎంపీలనిస్తే ఏమిచ్చిన్రు?
రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే కిషన్రెడ్డి, బండి సంజయ్ కేంద్రమంత్రులయ్యారని.. కానీ వాళ్లు రాష్ట్రానికి నిధులెందుకు తేవడం లేదని సీఎం ప్రశ్నించారు. ‘‘కేంద్రంలో ప్రభుత్వం మీదే. ప్రధాని మీవాడే. మరి ఫండ్స్ ఎందుకు తేలేకపోతున్నరో ఎంపీ అర్వింద్చెప్పాలె. నిజామాబాద్కు ఎయిర్పోర్టు ఈ రోజుదాకా రాలే. హైదరాబాద్ మెట్రోకు రూపాయి తేలే. మూసీ ప్రక్షాళనకు పది పైసల సాయం ఇయ్యలే. రీజనల్ రింగ్రోడ్చర్చే లేదు. ఏం తెచ్చి ఇచ్చారని ఇవాళ ఓట్లడుగుతున్నరు. ఓట్లు మాత్రమే కావాలా? తరువాత జనం వారి అవసరాలు వద్దా?’’ అని సీఎం నిలదీశారు.
