- ఆగస్టు 3 వరకు నాయకులెవరూ గాంధీ భవన్కు రావొద్దు
- మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్చార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు క్షేత్రస్థాయిలో బీఎల్ఏలతో సమన్వయం చేసుకోవాలి
- బీఎల్వోల రిపోర్టులపైనే ఆధారపడొద్దు..
- అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటు కోల్పోకుండా చూడాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారం తరహాలో ‘సర్’ ప్రక్రియను పర్యవేక్షించాలని, వచ్చే 10 రోజులు నియోజకవర్గాల్లో పర్యటించాలని కాంగ్రెస్ నేతలను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. నేతలంతా పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. ఆదివారం ‘సర్’ ప్రక్రియపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్తో కలిసి సీఎం రేవంత్రెడ్డి జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు. అలాంటి వారికి అపాయింట్మెంట్లు ఇవ్వం. ఆగస్టు 3 వరకు నాయకులెవరూ గాంధీభవన్కు రావాల్సిన అవసరం లేదు’’ అని స్పష్టం చేశారు. కొందరు నాయకులు నియోజకవర్గాలకు వెళ్లకుండా హైదరాబాద్కే పరిమితమవుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘సర్’ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించడాన్ని సువర్ణ అవకాశంగా మలచుకోవాలని, అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటు కోల్పోకుండా చూడాలని అన్నారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సర్’పై 489 సమావేశాలు జరిగాయని, బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలన్నారు.
బీఎల్ఏల నివేదికలే ప్రామాణికం
అన్ని జిల్లాల్లో సోమవారం 10 మంది ఇన్చార్జి మంత్రులు ‘సర్’ పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతను పూర్తిగా ఇన్చార్జి మంత్రులకే అప్పగిస్తున్నట్టు చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పటికీ ఎంపీలు తమ పరిధిలోని నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పార్టీ పరంగా ‘సర్’ ఇన్చార్జీలుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, చైర్మన్లు బీఎల్వోల రిపోర్టుల కంటే బీఎల్ఏల రిపోర్టులను పరిశీలించాలని, వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
4 నియోజకవర్గాల్లో అసలే పని చేయట్లేదు..
‘సర్’పై సీఎం రేవంత్రెడ్డికి నేతలు రిపోర్ట్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 4 నియోజకవర్గాల్లో నేతలు అసలే పనిచేయట్లేదని రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. అలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహుదూర్పూర్ నియోజకవర్గాల్లో అసలు పని చేయట్లేదని గుర్తించామన్నారు. పని చేయని ఆయా ప్రాంతాల ఇన్చార్జీలపై సీఎం సీరియస్ అయ్యారు.
52 నియోజకవర్గాల్లో బాగా పనిచేస్తున్నట్టు.. 42 నియోజకవర్గాల్లో మధ్యస్తంగా పని చేస్తున్నట్టు నివేదిక అందిందని వివరించారు. 21 నియోజకవర్గాల్లో సరిగా పని చేయట్లేదని గుర్తించామని పేర్కొన్నారు.బీఎల్వోల రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీపరంగా పనిచేస్తున్న బీఎల్ఏలను నాయకులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని, హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదన్నారు.
ఇన్చార్జ్ మంత్రులదే పూర్తి పర్యవేక్షణ
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ‘సర్’ కోసం నియమించిన పార్టీ ఇన్చార్జీలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని సీఎం రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. బీఎల్ఏ, బీఎల్వో రిపోర్టులను గాంధీభవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ‘సర్’ను ఇన్చార్జి మంత్రులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిందేనని, అన్నింటికీ వారిదే బాధ్యతని పేర్కొన్నారు.
ఈ నెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకొని ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలను సమన్వయం చేయాలని మార్గనిర్దేశం చేశారు. బాగా పనిచేసే 100 మంది బీఎల్ఏలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి ఫొటో దిగే అవకాశం కల్పించాలని సూచించారు.
నిర్లక్ష్యాన్ని సహించబోం: మహేశ్గౌడ్
‘సర్’ ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ఇందులో ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. నాయకులంతా నియోజకవర్గాల్లోనే ఉంటూ బీఎల్ఏలకు పూర్తి సహకారం అందించాలన్నారు. గతంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన నష్టాలను బేరీజు వేసుకొని, ఇక్కడ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
