- వానాకాలంలోపే బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయాలి: సీఎం రేవంత్
- మేడిగడ్డ వద్దే బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచన
- స్వయంగా వచ్చి పనులు పరిశీలిస్తానని వెల్లడి
- పనుల్లో జాప్యం చేయకూడదని ఆదేశం
- మంత్రి ఉత్తమ్తో కలిసి కాళేశ్వరంపై సమీక్ష
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలకు రిపేర్లు చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం సమీక్ష నిర్వహించారు. రిపేర్ల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.
దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్యర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణ ను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలన్నా రు. నీటిపారుదల శాఖ, సీడబ్ల్యూపీఆర్ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్స్ తో టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజీని అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఇంజనీర్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకోవాలని, వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలన్నారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని, డిసెంబరు వరకు చేయాల్సిన పనులపైన పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని సూచించారు. పనులలో జాప్యం జరగడానికి వీలు లేదన్న ముఖ్యమంత్రి.. నిధుల విషయంలో ఇబ్బంది కల్గనివ్వబోమని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభం అయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, సీఎం కార్యదర్శి మానిక్ రాజ్, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
